పరారీలో సునీల్‌ కనుగోలు.. ‘మీమ్స్‌ వీడియో’ల కేసులో అతనే ప్రధాన నిందితుడు | Sakshi
Sakshi News home page

పరారీలో సునీల్‌ కనుగోలు.. ‘మీమ్స్‌ వీడియో’ల కేసులో అతనే ప్రధాన నిందితుడు

Published Wed, Dec 14 2022 4:24 PM

Police Clarity On Raids At TPCC Strategist Sunil Kanugolu Office Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గళం, భారత యువకుడు పేర్లతో సోషల్‌ మీడియాల్లో సర్క్యులేట్‌ అవుతున్న మీమ్స్‌ వీడియోలు అసభ్యకరంగా ఉండటంతో నగరంలో 5 కేసులు నమోదయ్యాయని హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ సంయుక్త పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ గజరావ్‌ భూపాల్‌ తెలిపా రు. సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసులో మంగళవారం రాత్రి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు సునీల్‌ కనుగోలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సునీల్‌ కనుగోలు గతంలో పొలిటికల్ స్ట్రాటజీ టీమ్ ఐ-ప్యాక్ లో ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేశారు. 2014లో బీజేపీ కోసం పని చేసిన బృందంలో ఒకరు. 2014 ఎన్నికల తర్వాత ఐ- ప్యాక్ తో విడిపోయి స్వంతంగా ఎస్.కె పేరుతో కొత్త సంస్థ ఏర్పాటు చేసుకున్నారు సునీల్. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ లో చేరిన సునీల్ కనుగోలు ప్రస్తుతం జాతీయ కాంగ్రెస్ లో కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ కు ఎస్.కె టీమ్ సేవలు అందిస్తున్నారు సునీల్ కనుగోలు.

బషీర్‌బాగ్‌లోని పాత కమిషనరేట్‌లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు ఆరోగ్యకరంగా ఉండాలి. మహిళ అని కూడా చూడకుండా అసభ్యకరంగా మీమ్స్‌ వీడియోలు చేయడం చట్ట ప్రకారం నేరమే. ఈ వీడియోలు, మీమ్స్‌ తదితరాలకు సంబంధించి సైబర్‌ క్రైమ్‌ ఠాణాతో పాటు మార్కెట్, చంద్రాయణగుట్ట, రామ్‌గోపాల్‌పేట్, అంబర్‌పేట్‌ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తమ ఠాణాలో నమోదైన కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక టూల్స్‌ వినియోగించారు.

ఫలితంగా ఆ వీడియోలు మాదా పూర్‌లోని మైండ్‌షేర్‌ యునై టెడ్‌ ఫౌండేషన్‌లో ఉన్న కార్యాలయం నుంచి అప్‌లోడ్‌ అవుతున్నట్లు గుర్తించారు. మంగళవారం అక్కడ దాడి చేసి 10 ల్యాప్‌టాప్‌లు, సీపీ యూలు, సెల్‌ఫోన్లు సీజ్‌ చేశాం. ఎం.శ్రీప్రతాప్, టి.శశాంక్, ఇషాంత్‌ను అదుపులోకి తీసుకున్నాం. వీరికి సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసి విడిచిపెట్టాం. వీరి విచారణలోనే సునీల్‌ కనుగోలు పేరు వెలుగులోకి వచ్చింది. అతడు చెప్పడంతోనే తాము ఆ పోస్టులు పెడుతున్నామన్నారు. దీంతో సునీల్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చాం. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారు’అని వివరించారు.  

అక్కడ బోర్డు కానీ, కాంగ్రెస్‌ పార్టీ పేరు కానీ లేదు 
‘మేం దాడి చేసిన కార్యాలయం కాంగ్రెస్‌ సోషల్‌ మీడియాకు చెందినది అంటున్నారు. వాళ్లు తమ వార్‌రూమ్‌ను రహస్యంగా పెట్టుకుంటారని తెలీ దు. అక్కడ బోర్డు కానీ, కాంగ్రెస్‌ పార్టీ పేరు కానీ లేదు. అసభ్యకరమైన మీమ్స్‌ ఎవరు రూపొందించినా.. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం’ అని జాయింట్‌ సీపీ గజరావ్‌ భూ పాల్‌ స్పష్టం  చేశారు. ఈ సందర్భంగా పోలీసులు తెలంగాణ గళం యూట్యూబ్‌ ఛానల్‌లో ఉన్న నాలుగు మీమ్స్‌తో కూడిన వీడియోలను ప్రదర్శించారు. వీటిలో టీఆర్‌ఎస్, బీజేపీలతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ప్రధాని మోదీలపై రూపొందించిన మీమ్స్‌ ఉన్నాయి.  

చదవండి: టీపీసీసీలో చల్లారని సెగ! 

Advertisement
Advertisement