మీలా రాజకీయ వ్యాపారిని కాను.. 

MLA Pratap Kumar Reddy Open Letter To Beeda Ravichandra - Sakshi

బీద రవిచంద్రకు ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి బహిరంగ లేఖ

సాక్షి, కావలి: ‘కర్ణాటకలో నిర్మాణ రంగంలో వ్యాపారం చేసుకుంటూ.. ఆర్థికంగా స్థిరపడ్డాక నేను పుట్టి పెరిగిన కావలి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చాను.. మీలా రాజకీయాలతో వ్యాపారం చేసే వ్యక్తిని కాను’ అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా మీ చెప్పు చేతల్లో ఉన్న పచ్చ మీడియాలో నీచమైన రాతలు, ప్రచారాలు చేయించిన బీద రవిచంద్ర ఇప్పుడు కూడా అదే సంస్కృతిని కొనసాగిస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగతంగా తనపై కావలి నియోజకవర్గ ప్రజలకు అన్ని విషయాలు తెలుసునని, అందుకే తనను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని గుర్తుచేశారు. తాను ఏ లక్ష్యం కోసం రాజకీయాల్లోకి వచ్చానో.. వాటిని సాధించాలనే పట్టుదలతో ఉన్నానని పేర్కొన్నారు. (అస్తిత్వాన్ని చాటుకునేందుకే చంద్రబాబు తంటాలు)

అన్ని రంగాల్లో వెనుకబడిన కావలి నియోజకవర్గంలో సాగు, తాగునీరు, రామాయపట్నం పోర్టు, ఫిషింగ్‌ హార్బర్, పారిశ్రామికవాడ, విమానాశ్రయంతో పాటు రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగు, ప్రభుత్వ వైద్యం నాణ్యతగా ప్రజలకు అందేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు. రాజకీయ వ్యాపారైన బీద రవిచంద్ర నిత్యం రాజకీయాలు మాత్రమే చేస్తూ, అందర్నీ ఆ ఊబిలోకి లాగేందుకు చేస్తున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తాను సాధించాలనుకున్న కావలి అభివృద్ధి లక్ష్యాన్ని నీరుగార్చేందుకు బీద రవిచంద్ర రాజకీయ డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా తాను వీటిని పట్టించుకోనని, అయితే సందర్భం వచ్చినప్పుడు ప్రజలకు అన్ని విషయాలను తెలియజేస్తానన్నారు. అక్రమార్జనపై సీబీఐ, సీబీసీఐడీ, అఖిలపక్ష కమిటీ ద్వారా విచారణకు సిద్ధపడాలని బీద రవిచంద్రకు సూచించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top