బీద రవిచంద్ర , సుబ్బానాయుడు
బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తితో 40 రిజిస్ట్రేషన్లు చేయించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర
ప్రభుత్వంలోని కీలక నేత అండ.. రూ.200 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఆయన కుటుంబ సభ్యుల పేరిట బదలాయింపు
ఇవన్నీ రామాయపట్నం పోర్టు, దగదర్తి విమానాశ్రయం పరిసరాల్లో ఉన్న ఖరీదైనవి
ఈ నెల 11న ఏపీ ఆగ్రోస్ చైర్మన్ సుబ్బానాయుడు బ్రెయిన్డెడ్.. 20వ తేదీన మృతి!
ఈలోపే ఆయన ఆస్తులను తన భార్య, కోడలు, సోదరుడు, అనుయాయుల పేరిట మార్పించిన బీద..
అల్లూరు సబ్ రిజిస్ట్రార్ను కాదని కావలిలో ఈ నెల 15, 17 తేదీల్లో రిజిస్ట్రేషన్
వీటి కోసమే సుబ్బానాయుడును 20వ తేదీ వరకు వెంటిలేటర్పై ఉంచినట్లు అనుమానం
బ్రెయిన్డెడ్ వ్యక్తి రిజిస్ట్రేషన్ ఎలా చేస్తాడు? సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే
రిజిస్ట్రేషన్ చెల్లుబాటు.. కానీ, ప్రభుత్వంలో ఉన్న పలుకుబడితో అధికారులపై ఒత్తిడి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయించిన బీద
సాక్షి, అమరావతి: బ్రెయిన్డెడ్ అయి అచేతనంగా ఆస్పత్రిలో ఉన్న వ్యక్తి లేచి వచ్చి రూ.వందల కోట్ల ఆస్తులను రిజిస్ట్రేషన్ చేశాడు. అది కూడా రెండు రోజుల్లోనే చేసేశాడు. ఆపై మళ్లీ ఆస్పత్రిలో చేరాడు. ఆ వెంటనే చనిపోయాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటారా? భారీ ఆస్తులను కాజేసేందుకు ప్రభుత్వంలోని కీలక నేత అండతో టీడీపీ ఎమ్మెల్సీ చక్రం తిప్పడంతోనే...! వివరాల్లోకి వెళ్తే... మాలేపాటి సుబ్బానాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు. ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
కావలి నియోజకవర్గంలో కీలక నాయకుడు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఆశించి చివరి నిమిషంలో భంగపడ్డారు. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు సుబ్బానాయుడు అత్యంత సన్నిహితుడు. వీరి మధ్య చాలా బలమైన ఆరి్థక బంధాలున్నాయి. ప్రభుత్వంలోని కీలక నేతను అడ్డుపెట్టుకుని అడ్డగోలు సెటిల్మెంట్ల ద్వారా సంపాదించారనే విమర్శలున్నాయి.
అనేక ఆస్తులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సుబ్బానాయుడు ఈ నెల 11వ తేదీన సీఎం చంద్రబాబు నిర్వహించిన వ్యవసాయ శాఖ సమీక్షకు హాజరై ఉన్నట్టుండి కుప్పకూలారు. తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేర్చగా బ్రెయిన్ స్ట్రోక్గా వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆయన ఆస్తులపై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కన్నేశారు. వాటిని తన పరం చేసుకునేందుకు పెద్ద గూడుపుఠాణీ నడిపారని సమాచారం.
40 ఆస్తులు.. 200 కోట్ల ఆస్తులు.. 2 రోజులు
సుబ్బానాయుడు 11వ తేదీ నుంచి ఆస్పత్రిలో అచేతనంగా ఉన్నారు. కానీ, ఆయన పేరిట ఉన్న సుమారు 40 ఆస్తులు ఈ నెల 15, 17వ తేదీల్లో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సోదరుడు, భార్య, కోడలు, సన్నిహితుల పేర్లపైకి మారిపోయాయి. ఇవన్నీ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు, దగదర్తి విమానాశ్రయం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పరిసరాల్లో ఉన్న ఖరీదైన ఆస్తులు. అల్లూరు మండలం ఇసుకపాలెం పరిధిలోకి వచ్చే వీటి విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.200 కోట్లకు పైనే అని అంచనా. అందుకని సుబ్బానాయుడి కుటుంబ సభ్యులను బెదిరించి ఆయన ఆస్తులను ఉన్నపళంగా బీద రవిచంద్ర తనవాళ్ల పేరిట మార్పించుకున్నారని సమాచారం. విషయం ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసి అత్యంత రహస్యంగా ఉంచారు.
కీలక నేతను తీసుకొచి్చ.. మంత్రాంగం
సుబ్బానాయుడు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే ఆస్పత్రికి చేరుకున్న బీద రవిచంద్ర ఆస్పత్రి యాజమాన్యాన్ని మేనేజ్ చేరని ఆరోపణలున్నాయి. ఆస్తులు రాయించుకునే ఉద్దేశంలోనే 20వ తేదీ వరకు సుబ్బానాయుడిని వెంటిలేటర్పై ఉంచారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మధ్యలో ఒక రోజు ప్రభుత్వంలోని కీలక నేతను తీసుకొచ్చి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడించారని అంటున్నారు. సుబ్బానాయుడి పదవిని కుటుంబ సభ్యుల్లోనే ఒకరికి ఇస్తామని చెప్పించారని సమాచారం.
ఎనీ వేర్ రిజిస్ట్రేషన్తో..
సుబ్బానాయుడి ఆస్తులను రాయించేసుకునేందుకు బీద రవిచంద్ర పెద్ద పన్నాగమే వేశారు. ఇçసుకపాలెం అల్లూరు సబ్ రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తుంది. కానీ, అక్కడి అధికారి కాకుండా తను చెప్పినట్లు వినే కావలి సబ్ రిజిస్ట్రార్ను పిలిపించి మేనేజ్ చేసినట్లు సమాచారం. ఎనీ వేర్ రిజిస్ట్రేషన్ అవకాశాన్ని దీనికోసం ఉపయోగించుకున్నారు. సుబ్బానాయుడి కుమారుడిని బెదిరించి ఆయన ఫోన్కు వచ్చే ఓటీపీలను తీసుకున్నారు.
15, 17 తేదీల్లో చకచకా రిజిస్ట్రేషన్లు
అల్లూరు మండలం ఇసుకపాలెం పరిధిలో సుబ్బానాయుడి పేరు మీద ఉన్న 40 ఆస్తులను 15, 17 తేదీల్లో రవిచంద్ర తన సోదరుడు బీద గిరిధర్, తన భార్య జ్యోతి, కోడలు రిషిత, సన్నిహితులైన కూరపాటి రఘునాథరాజు, నిడిమొసలి మల్లికార్జున్రెడ్డి, నిడిమొసలి సుజన, తుంగా ఉష, నర్రా శ్రీధర్, రేబాల వెంకటశరణ్ పేర్లపైకి మా
ర్పించేశారు. వాస్తవానికి ఈ ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయాలంటే వాటి యజమాని అయిన సుబ్బానాయుడు కచ్చితంగా ఉండాలి.
సంతకాలు పెట్టడంతో పాటు ఆధార్ అథెంటికేషన్, వేలి ముద్రలు కూడా వేయాలి. తన మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని చెప్పాలి. కానీ, ఈ నెల 11వ తేదీన స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి ఆయన స్పృహలోనే లేరు. అయినప్పటికీ, ప్రభుత్వంలోని కీలక నేత ప్రమేయం ఉండడంతో రవిచంద్రకు అడ్డులేకపోయింది. పని పూర్తయిపోయింది. రూ.వందల కోట్ల విలువైన ఆస్తులు చేతులు మారాయి. రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాక వెంటిలేటర్ తొలగించి సుబ్బానాయుడు మృతి
చెందినట్లు ప్రకటించారు.
సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే రిజిస్ట్రేషన్ చెల్లుబాటు
సాధారణంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వ్యక్తి మాత్రమే తన పేర ఉన్న ఆస్తిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయాలి. స్పృహలో లేకుండా, తన ప్రమేయం లేకుండా ఉన్నప్పుడు బలవంతంగా ఎవరి ప్రోద్బలంతోనైనా రిజిస్ట్రేషన్ చేస్తే అది చెల్లదు. అంతేకాదు అది పెద్ద నేరమని రిజిస్ట్రేషన్ల చట్టం చెబుతోంది. తప్పని తెలిసినా.. సుబ్బానాయుడి ఆస్తులను అధికార బలంతో బీద రవిచంద్ర తనవారి పేర్లపైకి మార్పించేసుకున్నారు.
రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లు ఇవే..
⇒ కావలి సబ్ రిజిస్ట్రార్ పరిధిలో 15వ తేదీన డాక్యుమెంట్ నంబర్లు 4456, 4463, 4458, 4455, 4459, 4480, 4477, 4478, 4479, 4454, 4481, 4457 ద్వారా సుబ్బానాయుడి ఆస్తులను బీద రవిచంద్ర తనవారి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
⇒ 17న 4521, 4552 డాక్యుమెంట్ నంబర్లతో రెండు రిజిస్ట్రేషన్లు చేయించారు. ఇవేకాక ఇతర ప్రాంతాల్లో ఉన్న చాలా ఆస్తులను సుబ్బానాయుడి నుంచి తమ వారి పేర్ల మీద మార్పించినట్లు తెలుస్తోంది.


