
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అన్నదమ్ముల మధ్య సవాల్ ఆసక్తిని రేపుతోంది. కర్ణాటక దివంగత ముఖ్యమంత్రి ఎస్. బంగారప్ప కుమారులిద్దరూ మరోసారి పోటీపడుతున్నారు. శివమొగ్గ జిల్లాలోని సొరబ నియోజకవర్గం నుంచి కుమార్ బంగారప్ప బీజేపీ నుంచి, మధు బంగారప్ప కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. బంగారప్ప 1967 నుంచి 1994 వరకు సొరబ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. చిట్టచివరి సారిగా ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు.
ప్రస్తుతం సొరబ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కుమార్ బంగారప్ప మరోసారి ఎన్నిక కావాలని తహతహలాడుతున్నారు. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్కు గుడ్ బై కొట్టేసి బీజేపీలో చేరిన కుమార్, అప్పటికే జేడీ(ఎస్) సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన మధుపై 3,286 ఓట్ల తేడాతో నెగ్గారు. 2021లో కాంగ్రెస్లో చేరిన మధు బంగారప్ప మరోసారి అదే నియోజకవర్గం బరిలో దిగడంతో అన్నదమ్ముల మధ్య పోరు ఉత్కంఠకు దారి తీస్తోంది.