సాక్షి, శ్రీకాకుళం: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ధర్మాన ప్రసాదరావుపై శ్రీకాకుళం రూరల్ పోలీస్టేషన్లో అక్రమ కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్ఐ సురేష్ ఇచ్చిన వివరాలు మేరకు.. కుందువానిపేట గ్రామంలో మత్స్యకారులకు గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇంటిని ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో ఈ ఏడాది మే నెల 14వ తేదీన గృహప్రవేశం చేసినందుకు హౌసింగ్ పీడీ వీవీ సత్యాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
పేద మత్స్యకారుల కోసమే మా పోరాటం: ధర్మాన
అర్హులైన పేద మత్స్యకారులు వైపే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని ధర్మాన ప్రసాదరా వు వివరణ ఇచ్చారు. పేదలకు ఇచ్చిన ఇళ్లను కొంతమంది తెలుగుదేశం బ్రోకర్లు అమ్ముకోవాలని చూస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. అర్హులైన మత్స్యకారులకు ఇల్లు ఇవ్వకుండా, వారి నోట్లో మట్టి కొట్టేందుకు కొంతమంది టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎలాంటి కేసులు నమోదు చేసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమాయకులైన మత్స్యకారుల వైపే ఉంటుందని భరోసా ఇచ్చారు.
అర్హులైన మత్స్యకారులకు ఇల్లు ఇవ్వడంలో ఎలాంటి తప్పిదం లేదని హైకోర్టు కూడా ఇటీవల తీర్పు ఇచ్చినప్పటికీ ఆ విషయం కొంతమంది నాయకులు తెలుసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. ఇలాంటి కేసుల్లో మితిమీరి జోక్యం చేసుకున్న అధికారులు రానున్న రోజుల్లో కోర్టు ధిక్కారణ కింద నిలబడాల్సి వస్తుందని తెలిపారు.


