
సాక్షి, హైదరాబాద్: తాను ఏది మాట్లాడినా సరే.. అది సంచలనమే అవుతుందని చెప్పుకునే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సభ సక్సెస్ అవుతుందనుకుంటున్నా.. ఆయనను చూడటానికి జనం ఆశగా ఉన్నారంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.
‘‘కేసీఆర్ సభకు జనం భారీగా రావొచ్చు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో స్మితా సబర్వాల్ ట్వీట్లో తప్పేం లేదు. ఆమె వాస్తవాన్నే ట్వీట్ చేశారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి ట్వీట్ చేసినట్టు లేదు. ఇదే విషయంలో సీఎస్పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. భూమల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం పునరాలోచన చేస్తుంది.’’ అంటూ ఆయన పేర్కొన్నారు.
కాగా, ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నిర్వహిస్తున్న రజతోత్సవ సభ కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రలో నిలిచిపోయే విధంగా జరపడానికి ఆ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ నెల 27న నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక సభకు ఉద్యమాల గడ్డ ఓరుగల్లు వేదిక కావడం గర్వంగా ఉందని కేటీఆర్ అన్నారు.
రజతోత్సవ సభ కోసం ఎల్కతుర్తి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా 1,250 ఎకరాల్లో సభ, పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 40 నుంచి 50 వేల వాహనాలు వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభాస్థలికి నలుమూలలా పార్కింగ్ ఉంటుందని కేటీఆర్ తెలిపారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల నుంచి వచ్చే వారికి 260 ఎకరాల్లో గోపాల్పూర్ రోడ్డువైపు, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి వచ్చే వావానాల కోసం ఎల్కతుర్తి సమీపంలో హుజూరాబాద్ మార్గంలో మరో 250 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశాం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ తదితర జిల్లాల వారికి ఎల్కతుర్తికి ఆర కిలోమీటర్ దూరంలోనే 600 ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యం ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు.