రాజ్యాంగాన్ని ద్వేషించినవాళ్లా పాఠాలు నేర్పేది?: ఖర్గే | Constitution Debate in RS: Kharge Slams Nirmala Sitharaman for Nehru attack | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని ద్వేషించినవాళ్లా మాకు పాఠాలు నేర్పేది?: ఖర్గే

Dec 16 2024 2:19 PM | Updated on Dec 16 2024 3:25 PM

Constitution Debate in RS: Kharge Slams Nirmala Sitharaman for Nehru attack

రాజ్యాంగంపై చర్చ.. రాజ్యసభలోనూ నిప్పులు రాజేస్తోంది. సోమవారం పెద్దల సభలో రాజ్యాంగం చర్చ మొదలైంది. అయితే.. నెహ్రూ ప్రస్తావనతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు.

‘‘లోక్‌సభలో రాజ్యాంగ చర్చ ద్వారా ప్రధాని మోదీ సభను తప్పుదోవ పట్టించారు. ఎలా మాట్లాడాలో ఈరోజు నేను వాళ్లకు(బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ..) చెప్పదల్చుకున్నా. నేను చదువుకుంది మున్సిపాలిటీ బడిలో. ఆమె(నిర్మలా సీతారామన్‌) జేఎన్‌యూ(జవహార్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ)లోనే కదా చదివింది. ఆమె హిందీగానీ, ఇంగ్లీష్‌గానీ మాట్లాడడం బాగుంది. ఆమె ఆర్థిక నిపుణురాలే కావొచ్చు. కానీ, ఆమె మాట్లాడే విధానమే అస్సలు బాగోలేదు.

.. జాతీయ పతకాన్ని, అందులో అశోక చక్రాన్ని.. రాజ్యాంగాన్నే ద్వేషించినవాళ్లు.. ఇవాళ మాకు పాఠాలు చెబుతున్నారు. రాజ్యాంగం వచ్చిన కొత్తలో వాళ్లే దానిని తగలబెట్టారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన టైంలో.. రామ్‌లీలా మైదానంలో గాంధీ, నెహ్రూ, అంబేద్కర్‌ దిష్టిబొమ్మలను తగలబెట్టిన విషయాన్ని వాళ్లు మరిచిపోయారేమో!’’ అని ఆయన మండిపడ్డారు. 

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్

అలాగే.. స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనని వాళ్లు కూడా.. ఆ పోరాటం ఎలా ఉంటుందో తమకు తెలుసంటూ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందంటూ ప్రధాని మోదీని ఉద్దేశించి ఖర్గే సెటైర్లు వేశారు. 1949లో ఆరెస్సెస్‌ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని, అది మనుస్మృతికి తగ్గట్లుగా లేదని ఆనాడు విమర్శించారని, రాజ్యాంగాన్నే కాకుండా మువ్వన్నెల జెండాను కూడా అంగీకరించలేదని, ఆ సంస్థ ప్రధాన కార్యాలయంపై 2002 రిపబ్లిక్‌ డేన తొలిసారి జాతీయ జెండా ఎగరేశారని, అదీ కోర్టు ఆదేశాల తర్వాతేనని ఖర్గే రాజ్యసభకు గుర్తు చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement