
పాలమూరులో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డిన సీఎం రేవంత్
గెలుపు అంచుల వరకు వచ్చి బోల్తా... మల్కాజ్గిరిలో మూడోస్థానానికే పరిమితం
నల్లగొండ, భువనగిరి సిట్టింగ్ స్థానాల్లో మళ్లీ కాంగ్రెస్దే గెలుపు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి మిశ్రమ ఫలితాలనిచ్చి నా, వ్యక్తిగతంగా సీఎం రేవంత్రెడ్డికి మాత్రం నిరాశను మిగిల్చాయి. సీఎం హోదాలో ఉన్న రేవంత్ సొంత లోక్సభ నియోజకవర్గమైన మహబూబ్నగర్లోనూ, సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. పాలమూరులో గెలుపు కోసం ఆయన సర్వశక్తులు ఒడ్డినా స్వల్ప తేడాతో పార్టీ అభ్యర్థి వంశీచందర్రెడ్డి ఓడిపోవడం, సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఏకంగా దాదాపు 4లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలాసార్లు మహబూబ్నగర్కు వెళ్లిన రేవంత్రెడ్డి మాట్లాడుతూ సొంత స్థానంలో తనను ఓడించి రాజకీయంగా బలహీనపర్చేందుకు కుట్రలు పన్నుతున్నారని వ్యాఖ్యానించారు. వంశీని గెలిపించేందుకు పలు హామీలనిస్తూ కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల లాంటి పథకాలను ప్రకటించారు. అయినా ఫలితం లేకపోవడంతో రేవంత్ శిబిరం ఒకింత నైరాశ్యంలో మునిగిపోయింది. అయితే, ఈ స్థానం నుంచి గెలుపు కాంగ్రెస్, బీజేపీల మధ్య దోబూచులాడడం,
బీజేపీ అభ్యర్థి డీకే.అరుణకు గట్టిపోటీ ఇస్తూ చాలా తక్కువ తేడాతో ఓడిపోవడం మాత్రం కొంత ఊరట కలిగించింది. ఇక, మల్కాజ్గిరిలో భారీ ఓటమి కూడా రేవంత్ శిబిరానికి మింగుడుపడని విషయమేనని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. తాను ప్రాతినిధ్యం వహించిన స్థానంలో, తాను కోరి తెచ్చిన అభ్యర్థి దాదాపు 4లక్షల ఓట్ల తేడాతో ఓడిపోవడం కాంగ్రెస్ అధిష్టానం వద్ద రేవంత్ వ్యక్తిగత ఇమేజ్ను ఎంతోకొంత నష్టపరుస్తుందని భావిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాలైన నల్లగొండ, భువనగిరిల్లో మళ్లీ ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. నల్లగొండలో 5.5లక్షలు, భువనగిరిలో 2.1లక్షల ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థులను చిత్తు చేసిన కాంగ్రెస్ ఆ రెండు సిట్టింగ్ స్థానాలనూ నిలబెట్టుకోవడం గమనార్హం.