మన పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరి: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Comments At Congress Legislature Party meeting | Sakshi
Sakshi News home page

మన పథకాలతో మోదీ ఉక్కిరిబిక్కిరి: సీఎం రేవంత్‌

Apr 16 2025 3:57 AM | Updated on Apr 16 2025 5:29 AM

CM Revanth Reddy Comments At Congress Legislature Party meeting

సీఎల్పీ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు పొంగులేటి, జూపల్లి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ తదితరులు

కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

మన కులగణన రాజకీయంగా మోదీకి మరణశాసనం

కులగణన గేమ్‌ ఛేంజర్‌ అయ్యింది..

బిహార్‌ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించబోతోంది 

కంచ గచ్చిబౌలి భూములపై అంతా కలిసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు 

కిషన్‌రెడ్డికి కేటీఆర్‌ చెప్పాడు..కిషన్‌రెడ్డి అమిత్‌ షాకు చెప్తే, ఆయన మోదీకి చెప్పాడు 

మోదీ బుల్డోజర్లు, జేసీబీలకు తేడా తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు 

మంత్రివర్గ విస్తరణను అధిష్టానం ఫ్రీజ్‌ చేసిందన్న ముఖ్యమంత్రి

ఐదు కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: ‘మన ప్రభుత్వానికి మంచి పేరు, సాఫీగా నడిచే విధంగా ఆదాయం రావడం బీఆర్‌ఎస్, బీజేపీలకు ఇష్టం లేదు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆ రెండు పారీ్టలు కలిసి చేసిన కుట్రలే ఇందుకు నిదర్శనం. మనం కోర్టులో గెలిచి ఆ భూములను తీసుకువచ్చాం. మొత్తం 2,200 ఎకరాల్లో మన ప్రభుత్వం క్లెయిమ్‌ చేస్తోంది 400 ఎకరాలే. మిగిలిన భూముల జోలికి వెళ్లడం లేదు. ఆ 400 ఎకరాల్లో ఐటీ టవర్స్‌ నిర్మించే ఆలోచనలో ఉన్నాం. 

అలా జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఉద్యోగాలు కూడా వస్తాయి. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఈ విషయాన్ని కేటీఆర్‌ స్వయంగా కిషన్‌రెడ్డికి చెప్పాడు. కిషన్‌రెడ్డి అమిత్‌షాకు చెపితే అమిత్‌షా మోదీకి చెప్పాడు. మన పథకాలు ప్రధానిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆయన రంగంలోకి దిగారు. బుల్డోజర్లు, జేసీబీలకు తేడా తెలియదన్నట్టు మాట్లాడుతున్నారు. 

అందరూ కలిసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. దేశంలో గుజరాత్‌ మోడల్‌ పోయింది. తెలంగాణ మోడల్‌ ప్రచారంలోకి వస్తోంది. ముఖ్యంగా కులగణన గేమ్‌ ఛేంజర్‌ అయింది. రేపు జరిగే బిహార్‌ ఎన్నికల్లో ముఖ్యపాత్ర పోషించబోతోంది. ప్రధాని మోదీకి ఇది రాజకీయంగా మరణశాసనం కాబోతోంది..’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో జరిగిన కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సీఎల్పి) సమావేశంలో ఆయన మాట్లాడారు. 

కళ్లు కుడుతున్న ప్రతిపక్షాలను కట్టడి చేయాలి 
‘సన్న బియ్యం, ఎస్సీల వర్గీకరణ, కులగణన, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు లాంటి అద్భుత కార్యక్రమాలతో ముందుకెళుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయి. కళ్లు కుడుతున్న ప్రతిపక్షాలను కట్టడి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. 

మీరు మళ్లీ గెలవాలంటే ఏం కావాలో అడగండి 
ఎవరైనా సరే పార్టీ లైన్‌కు కట్టుబడి ఉండాలి. నేనైనా, డిప్యూటీ సీఎం భట్టి అయినా పార్టీ చెప్పిన మేరకే పనిచేస్తాం. ప్రభుత్వంతో పాటు పార్టీ బలంగా ఉంటేనే మరోసారి గెలుస్తాం. మీరు రెండోసారి గెలవాలంటే మీ నియోజకవర్గంలో ఏం కావాలో నివేదిక తయారు చేసుకోండి. అవసరమైతే కన్సల్టెంట్‌ను పెట్టుకోండి. మే 1 నుంచి మీకు అందుబాటులో ఉంటా. మీ నివేదికలు నాకివ్వండి. నేను కూడా వెరిఫై చేసుకుని నిధులు కేటాయిస్తా. మీ నియోజకవర్గాలకు వస్తా. పాదయాత్రలా, కార్నర్‌ మీటింగ్‌లా, బహిరంగ సభలా.. ఏం పెడతారో మీ ఇష్టం. ఈ విషయంలో డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు కార్యాచరణ ఇస్తారు.  

జూన్‌ 2 నుంచి జనాల్లోకి వస్తా.. 
నేను కూడా జూన్‌ 2 వరకు జనాల్లోకి వస్తా. మన ప్రభుత్వం ఏం చేస్తోందో ప్రజలకు వివరిద్దాం. సన్న బియ్యం పథకంతో ప్రభుత్వానికి ప్రజల్లో మంచి పేరు వస్తోంది. సన్నబియ్యం కాంగ్రెస్‌ పార్టీ పథకం. ఇది పేటెంట్, మన బ్రాండ్‌. సన్న బియ్యంతో పాటు ఎస్సీల వర్గీకరణ, కులగణన, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఈ విషయంలో ఇన్‌చార్జి మంత్రులు కీలక పాత్ర పోషించాలి. పార్టీ ప్రతిష్టను ఎవరూ దెబ్బతీయొద్దు..’ అని రేవంత్‌ అన్నారు.  

భారత్‌ సమ్మిట్‌కు రాహుల్, ప్రియాంక 
‘మంత్రివర్గ విస్తరణను రిజర్వుడ్‌ ఫర్‌ జడ్జిమెంట్‌ తరహాలో అధిష్టానం ఫ్రీజ్‌ చేసింది. ఎవరేం చెప్పుకోవాలన్నా హైకమాండ్‌కు చెప్పుకోవాలి. భువనగిరి ఎంపీ కిరణ్‌రెడ్డి తను వెళ్లిన చోటల్లా ఒక మంత్రిని ప్రకటిస్తున్నాడు. అది సరైంది కాదు. అద్దంకి దయాకర్‌ చాలా ఓపికగా వెయిట్‌ చేశాడు. పార్టీ లైన్‌లో పనిచేశాడు. అవకాశం వచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెలలో నిర్వహించే భారత్‌ సమ్మిట్‌కు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాం«దీలు వస్తున్నారు. అంతర్జాతీయ ప్రతినిధులు కూడా వస్తారు. పీసీసీ అధ్యక్షుడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యతను మంత్రులకివ్వాలి..’ అని సీఎం చెప్పారు.  

అవి వారి అస్తిత్వానికే ప్రమాదం: డిప్యూటీ సీఎం భట్టి 
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో లబ్ధిదారులు సంతోషంగా ఉన్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. సంక్షేమం ఒక ఎత్తయితే ఎస్సీల వర్గీకరణ, బీసీల కులగణన కార్యక్రమాలను గొప్ప గొప్ప నాయకులే చేయలేకపోయినా, తెలంగాణ ప్రభుత్వం ధీరోదాత్తంగా చేసిందని అన్నారు. ఇవి బీఆర్‌ఎస్, బీజేపీలను కట్టి మూలన పడేస్తాయని, వారి అస్తిత్వానికే ప్రమాదంగా మారనున్నాయని వ్యాఖ్యానించారు. సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు సీఎం చెక్కులు అందజేశారు. 

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్‌లను అభినందించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.  బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కూడా హాజరయ్యారు.  

బెంబేలెత్తించిన లిఫ్ట్‌ 
సీఎల్పీ సమావేశం జరిగే రెండో అంతస్తుకు వెళ్లేందుకు గాను సీఎంతో పాటు పలువురు నేతలు లిఫ్ట్‌ ఎక్కారు. రెండో అంతస్తుకు వెళ్లిన ఆ లిఫ్ట్‌ అకస్మాత్తుగా మళ్లీ వేగంగా కిందకు వచ్చింది. దీంతో గాభరాపడిన వారంతా మరో లిఫ్ట్‌లో సమావేశ హాలుకు వెళ్లారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement