భారతీయుల ఆత్మగౌరవం ట్రంప్‌ దగ్గర తాకట్టా?: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy slams PM Narendra Modi | Sakshi
Sakshi News home page

భారతీయుల ఆత్మగౌరవం ట్రంప్‌ దగ్గర తాకట్టా?: సీఎం రేవంత్‌

May 30 2025 12:55 AM | Updated on May 30 2025 12:55 AM

CM Revanth Reddy slams PM Narendra Modi

బాచుపల్లిలో నిర్వహించిన జైహింద్‌ యాత్రలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ విజయశాంతి తదితరులు

యుద్ధాన్ని అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారు?  ప్రధాని మోదీపై సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజం

రఫేల్‌ విమానాలు ఎన్ని నేలకూలాయో చెప్పాలి? 

యుద్ధ విరమణతో సైనికుల ఆత్మస్థైర్యం, ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారు 

ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం.. మీ సొంత వ్యవహారం కాదు 

యుద్ధంపై ఉపన్యాసాలు కాదు.. ప్రధాని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి 

మోదీకి వీరతిలకం దిద్దితే యుద్ధంలో వెనుకడుగు వేశారు 

పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి 

జైహింద్‌ యాత్ర అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపులతో ప్రధాని మోదీ పాకిస్తాన్‌తో యుద్ధం విరమించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని, దేశ ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. 

‘అమెరికా ఒత్తిడికి తలొగ్గి యుద్ధాన్ని అర్ధాంతరంగా ఆపేస్తారా? భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్‌ దగ్గర తాకట్టు పెడతారా? యుద్ధం అంటే ధైర్యం, వెన్నెముక, యుద్ధతంత్రం ఉండాలని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ నాలుగు రోజుల యుద్ధం తర్వాత అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారు? పాకిస్తాన్‌తో యుద్ధంలో రఫేల్‌ విమానాలు ఎన్ని నేలకూలాయో లెక్క చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో గురువారం బాచుపల్లి వీఎన్‌ఆర్‌ జ్యోతి ఇంజనీరింగ్‌ కాలేజీ నుంచి కేజీఆర్‌ కన్వెన్షన్‌ వరకూ జైహింద్‌ యాత్ర కొనసాగింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. కాంగ్రెస్‌ హయాంలోని యుద్ధ విమానాలే పాకిస్తాన్‌తో యుద్ధంలో దేశ ఆత్మ గౌరవాన్ని కాపాడాయని, మోదీ కొనుగోలు చేసిన రఫేల్‌ విమానాలు మాత్రం యుద్ధంలో నేలకూలాయని ఎద్దేవా చేశారు. 

యుద్ధం చేయాలనుకున్నప్పుడు అఖిలపక్షాన్ని పిలిచారని.. యుద్ధం ఆపేసినప్పుడు అఖిలపక్షాన్ని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. యుద్ధంపై ఉపన్యాసాలు చెప్పడం కాదు. దేశ ప్రజలకు మోదీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 

ఇందిరను స్ఫూర్తిగా తీసుకోవాలి 
పాకిస్తాన్‌తో యుద్ధంలో అపరకాళీ ఇందిరా గాంధీని ప్రధాని మోదీ స్ఫూర్తిగా తీసుకుంటే బాగుండేదని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినప్పుడు యుద్ధం ఆపాలని ఇందిరా గాం«దీని అప్పటి అమెరికా అధ్యక్షుడు బెదిరించారని, కానీ ఆమె అమెరికా బెదిరింపులకు లొంగలేదన్నారు. భారత్‌ వైపు ఎవరు కన్నెత్తి చూసినా కనుగుడ్లు పీకేస్తామని.. చైనాకు ఇందిరాగాంధీ వార్నింగ్‌ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 

ఆనాడు చైనాపై యుద్ధం ప్రకటించి గట్టిగా బుద్ధి చెప్పిన ఘనత ఇందిరమ్మదన్నారు. భారత ఆర్మీ కల్నల్‌ సంతోష్‌ను చైనా పొట్టన పెట్టుకుంటే మోదీ కనీసం చైనాకు బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 1971లో భారత్‌–పాక్‌ యుద్ధ సమయంలో అమెరికా మధ్యవర్తిత్వం అవసరం లేదని ఇందిరా గాంధీ నిర్మొహమాటంగా చెపారని, యుద్ధంలో ఇందిరమ్మ పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేసి చూపారన్నారు. 

ఇందిరమ్మ స్ఫూర్తితో పాక్‌ను రెండు ముక్కలు చేయాలని.. తాము మద్దతుగా ఉంటామని చెప్పారు. పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని రేవంత్‌ కోరారు. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలుపుకొనేందుకు పాక్‌పై యుద్ధం చేయాలని, రాజకీయాలకు అతీతంగా అండగా ఉంటామని చెప్పామన్నారు. భారత్‌పై పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారని, ఉగ్రవాదులను తుదముట్టించే వరకూ సైన్యానికి అండగా ఉంటామని తెలిపారు.  

రాహుల్‌ గాంధీపై విమర్శలా? 
అమెరికాకు తలొగ్గి యుద్ధం విరమించిన బీజేపీ.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాందీపై విమర్శలు చేయడం విడ్దురంగా ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి దుయ్యబట్టారు. భారత్‌ 1967లో చైనాను, 1971లో పాకిస్తాన్‌ను ఓడించినందుకు కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారా ఎద్దేవాచేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది, గాంధీ కుటుంబానిదన్నారు. 

మోదీకి వీరతిలకం దిద్ది పాకిస్తాన్‌పై యుద్ధం చేయాలని చెబితే.. ఎందుకు వెనుకడుగు వేశారో బీజేపీ నేతలే చెప్పాలన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని, మీ సొంత వ్యవహారం కాదని ధ్వజమెత్తారు. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తారన్నారు. 

భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని బీజేపీ దెబ్బతీస్తే.. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు కాంగ్రెస్‌ జైహింద్‌ యాత్ర చేపట్టిందని చెప్పారు. రాహుల్‌ గాందీని దేశానికి ప్రధానిగా చూసే వరకు మనం విశ్రమించొద్దని పార్టీ కార్యకర్తలకు రేవంత్‌ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement