పవిత్ర జెరూసలేంపై క్షిపణి దాడులు: వారి మౌనంపై తీవ్ర చర్చ | Iranian missiles target Jerusalem Where is Tucker Carlson and Candace | Sakshi
Sakshi News home page

పవిత్ర జెరూసలేంపై క్షిపణి దాడులు: వారి మౌనంపై తీవ్ర చర్చ

Mar 31 2026 4:53 PM | Updated on Mar 31 2026 5:57 PM

Iranian missiles target Jerusalem Where is Tucker Carlson and Candace

ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్  మొదలు  పెట్టిన యుద్ధం, ఇరాన్‌ ప్రతి దాడుల నేపథ్యంలో పవిత్ర వారంలో (Holy Week)  పాస్ ఓవర్ (Passover) వేడుకల సమయంలో ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు పాల్పడటం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యంగా యూదులు, క్రైస్తవులు, ముస్లింలకు అత్యంత పవిత్రమైన ఈ నగరంపై దాడులు జరగడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ఈ దాడులను ధృవీకరించింది.

జెరూసలేం ఆకాశంలో క్షిపణి దాడులు
మంగళవారం ఇరాన్,  ఇజ్రాయెల్ భూభాగంపైకి భారీగా క్షిపణులు ప్రయోగించింది.  జెరూసలేం అంతటా సైరన్లు మోగాయి. వందలాది డ్రోన్లు మరియు బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌పైకి ప్రయోగించింది. దీంతో జెరూసలేంలోని టెంపుల్ మౌంట్ (Temple Mount) అల్-అక్సా మసీదు (Al-Aqsa Mosque) వంటి పవిత్ర ప్రదేశాలపై క్షిపణి దాడి దృశ్యాలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. అయితే  పైన 'ఐరన్ డోమ్' , 'ఆరో' (Arrow) రక్షణ వ్యవస్థలు ఆ క్షిపణులను అడ్డుకున్నాయి. ఒకవేళ ఇవి నేరుగా తగిలి ఉంటే కోలుకోలేని నష్టం వాటిల్లేది. 

మరోవైపు ప్రముఖ అమెరికన్ వ్యాఖ్యాతలు టకర్ కార్ల్‌సన్ (Tucker Carlson) ,క్యాండేస్ ఓవెన్స్ (Candace Owens) ఈ విషయంలో ఇరాన్‌ను గట్టిగా ఖండించకపోవడమే కాకుండా, విభిన్నమైన, వివాదాస్పదమైన వాదనలు వినిపిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. జెరూసలేం క్రైస్తవులకు, యూదులకు అత్యంత పవిత్రమైనది. అయినప్పటికీ, ఈ వ్యాఖ్యాతలు ఇటీవల ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.ఇరాన్ దాడులను వారు ఖండించకపోవడం వారి మద్దతుదారుల్లో కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

"అమెరికా ఫస్ట్" (అంటే అమెరికా ఇతర దేశాల యుద్ధాల్లో పక్షం వహించకూడదు) అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతున్నవాళ్లలో వీరు ముఖ్యులు. ఈ క్రమంలో ఇరాన్ దురాక్రమణను నేరుగా ఖండించడం కంటే, అమెరికా ఈ గొడవల్లో ఎందుకు జోక్యం చేసుకుంటోంది అంటూ విమర్శలు గుప్పించారు. అటు ప్రస్తుతం అమెరికాలోని రైట్‌ వింగ్‌లో ఒక పెద్ద చీలిక కనిపిస్తోంది. ఒక వర్గం ఇజ్రాయెల్‌ను పవిత్ర భూమిగా భావించి బేషరతుగా మద్దతు ఇస్తుంటే,కార్ల్‌సన్ , ఓవెన్స్ వంటి వారు ఇజ్రాయెల్‌కు అమెరికా ఇచ్చే ఆర్థిక, సైనిక మద్దతును ప్రశ్నిస్తున్నారు. అయితే జెరూసలేం వంటి పవిత్ర నగరం ప్రమాదంలో ఉన్నప్పుడు కూడా వీరు ఇరాన్‌ను ఖండించకపోవడం వెనుక వారి "ఐసోలేషనిజం" (Isolationism - అంటే ఇతర దేశాల గొడవల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదనే సిద్ధాంతం). ఇటీవల వారు అనుసరిస్తున్న ఇజ్రాయెల్ వ్యతిరేక ధోరణి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

కాగా ఫిబ్రవరి 28న మొదలైన యుద్ధం దాడులు, ప్రతిదాడులతో యావత్‌ ప్రపంచం దద్దరిల్లుతోంది. పవిత్ర భూమిపై భీకర దాడులు, యుద్ధమేఘాలు కమ్ముకోవడం, అంతర్జాతీయ వేదికలపై దీనిపై జరుగుతున్న భిన్నాభిప్రాయాల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం  ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement