వెంకట్రాంపురం గ్రామం వినూత్న నిర్ణయం
ఖమ్మం జిల్లా: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వెంకట్రాంపురం పంచాయతీ పాలకవర్గం వినూత్న ఆలోచన చేసింది. తమ గ్రామంలోకి వచ్చే ప్రతీ ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేనిపక్షంలో గ్రామంలోకి ప్రవేశం లేదని గ్రామ పొలిమేరలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. పోలీసులు ఇటీవల ‘అరైవ్..అలైవ్’కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలని చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనదారుల భద్రత కోసం తమ పాలకవర్గం తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ ధరావత్ శివాజీ విజ్ఞప్తి చేశారు.


