రైతుభరోసా ఖరీఫ్ పెట్టుబడి సాయం నిధులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. చిత్రంలో ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, గుత్తా సుఖేందర్రెడ్డి, సందీప్కుమార్ సుల్తానియా, రామచంద్రునాయక్, భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్రెడ్డి, అజహరుద్దీన్, అనిల్కుమార్యాదవ్, సంజయ్జాజు, బీర్ల అయిలయ్య, వీర్లపల్లి శంకర్, మల్రెడ్డి రంగారెడ్డి, బలరాంనాయక్
ఏముందో అదే చెబుతా... చెప్పిందే చేస్తా
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నా రాజకీయ జీవితం: సీఎం రేవంత్
బెల్టు షాపులు తప్ప కేసీఆర్ పాలనలో వచ్చినవేమీ లేవు
కూలిన ‘కాళేశ్వరం’ నుంచి చుక్క నీరు తీసుకోకున్నా పంటలు పండాయి
వైఎస్సార్ రైతులకు ఉచిత విద్యుత్ తెచ్చి బిల్లులు మాఫీ చేశారు
రైతు భరోసా ఖరీఫ్ నిధుల విడుదల సభలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
భవిష్యత్తులో పంట వేసిన రైతులకే భరోసా: మంత్రి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: ‘అధికారం కోసం అబద్ధాలు చెప్పను. ఏముందో అదే చెబుతా... చెప్పిందే చేస్తా. అబద్ధాల పునాదులపై ప్రభుత్వం నడపను. ఈ ప్రభుత్వం రైతులది, పేదలది, మహిళలది, నిరుద్యోగులది. పదవి శాశ్వతం కాదు... మాట శాశ్వ తం. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నా రాజకీయ జీవితం’అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రైతు భరోసా పథకం కింద ఖరీఫ్ పెట్టుబడి సాయం విడుదల సందర్భంగా నిర్వహించిన రైతు భరోసా సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా గత బీఆర్ఎస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ మళ్లీ వస్తాడని ఇద్దరు పిల్ల రాక్షసులు చెబుతున్నారని.. ఆయన రావడం వల్ల ఆ కుటుంబానికే ఉపయోగం తప్ప ప్రజలకు ఒనగూరేదేముందని సీఎం ప్రశ్నించారు.
పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారని.. అయితే బెంగాల్లో అధికారంలోకి రావడానికి బీజేపీకి 15 ఏళ్లు పట్టిందని.. ఇక్కడ కూడా అలాగే వేచి ఉండాలని ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్య అంశమని చెప్పారు. రైతుల కోసం ప్రతినెలా రూ. 6 వేల కోట్ల చొప్పున గత 30 నెలల్లో రూ. 1.75 లక్షల కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పంటా కాళేశ్వరం నీళ్లతోనే పండుతోందని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొనే వాళ్లని.. కానీ మూడేళ్లుగా అక్కడి నుంచి చుక్క నీరు రాకపోయినా తెలంగాణ రైతులు 2 కోట్ల 80 లక్షల టన్నుల ధాన్యం ఎలా పండించారో చెప్పాలని సీఎం ప్రశ్నించారు. ఫాంహౌస్లో వరి పండించి క్వింటా రూ. 4,200కు అమ్ముకున్నాయన వరి వేస్తే ఉరి అని రైతులను భయపెట్టారని విమర్శించారు.
కేసీఆర్ మళ్లీ వస్తాడా... ఎందుకు?
ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లలో అయిన అప్పు రూ. 69 వేల కోట్లు అయితే, పదేళ్లలో కల్వకుంట్ల కుటుంబం రూ. 7 లక్షల కోట్లకుపైగా అప్పు చేసిందని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు కూడా విడతలవారీగా ఇచ్చారని.. బడి పిల్లల భోజన బిల్లులు, యూనిఫాం బిల్లులు, స్వయం సహాయక సంఘాల బకాయిలు, సర్పంచుల బిల్లులు... ఇలా ఏ ఒక్కటీ చెల్లించకుండా వెళ్లిపోయారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అయిందో లేదో అప్పుడే దిగిపోవాలంటున్నారని.. అడగగానే దిగిపోవడానికి తాము గడీల ముందు బానిసలమా? అని సీఎం ప్రశ్నించారు. ‘కేసీఆర్ మళ్లీ వస్తే ప్రజలకు ఏం చేస్తడు. ప్రజలకేం ఇచ్చిండని వస్తడు? మొగుడు పెళ్లాలు మాట్లాడుకునే మాటలు వినడానికా? రైతు బజార్లు తీసుకురావాల్సింది పోయి బెల్టు షాపులు తీసుకొచ్చారు. రాష్ట్రంలో తాగుడు సంస్కృతిని పెంచారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. దళితులకు 3 ఎకరాల చొప్పున భూపంపిణీ ఇవ్వలేదు. రూ. లక్ష చొప్పున రైతులకు రుణమాఫీ చేయలేదు. మేం సంసారాల్లో చిచ్చుపెట్టే తప్పుడు రాజకీయాలు చేయం. ఫోన్ ట్యాపింగ్ లాంటి పనులు మా ప్రభుత్వంలో ఉండవు’అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
మోదీ వచ్చి మోరీ తీస్తడా?
‘తెలంగాణలో కూడా మోదీ పాలన వస్తదని బీజేపీ నేతలు అంటున్నారు. అయినా మోదీ వచ్చి మోరీ తీస్తాడా? ప్రతి పేదవాడి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని మోదీ చెప్పారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ లెక్కన 12 ఏళ్లలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఎక్కడ ఉన్నాయి ఆ ఉద్యోగాలు? తెలంగాణలో బండి సంజయ్, కిషన్రెడ్డికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు’అని రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్
‘ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ పేటెంట్. వై.ఎస్. రాజశేఖరరెడ్డి పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి అధికారంలోకి వచ్చిన రోజే ఉచిత విద్యుత్పై సంతకం చేశారు. రూ. 12 వేల కోట్ల విద్యుత్ బిల్లులను కూడా మాఫీ చేశారు. ఎవరైనా ఉచిత విద్యుత్ ఇచ్చామంటే ఉరికించి కొట్టేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఉచిత విద్యుత్ కోసం గత 30 నెలల్లో రూ. 30 వేల కోట్లు వెచ్చించాం. ప్రతిపక్ష నాయకులు మూసీ అభివృద్ధి వద్దంటారు... మెట్రో వద్దంటారు... రీజనల్ రింగ్ రోడ్ వద్దంటారు... పొర్లు దండాలు పెట్టినా అభివృద్ధి పనులు ఆపం’అని రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు.
పంట మార్పిడి తప్పనిసరి
ఈసారి వర్షాలు తక్కువగా పడే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నందున వర్షాలను బట్టి రైతులు పంటలు వేసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ‘మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచాం. రైతులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు వేయాలి. పంట మార్పిడి చేయాలని శాస్త్రవేత్తలు చెప్పిన మాటలు నేను చెబితే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అబద్ధాలు చెప్పుకుంటూ బతకాలనే శాపం బావబామ్మర్ధులకు ఉన్నట్లుంది. అందుకే పోటీ పడి అబద్ధాలు చెబుతున్నారు. ఎవరేం చెప్పినా 9 రోజుల్లో రైతుభరోసా కింద రూ. 9 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తాం’అని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
భూమి భరోసా కాదు... పంటకు భరోసా: మంత్రి తుమ్మల
భవిష్యత్తులో పంట వేసిన వారికే రైతు భరోసా అందించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడుతూ ఇది భూమి భరోసా కాదని, పంటకు ఇచ్చే భరోసా అని స్పష్టం చేశారు. పంటల మార్పిడి చేయాలని, ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు పప్పు దినుసులు పండించాలని కోరారు. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా, రైతు రుణమాఫీ, 24 గంటల ఉచిత విద్యుత్, రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు, వేగవంతమైన చెల్లింపులతో రైతుల జీవితాల్లో నమ్మకాన్ని నింపామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరితోపాటు రైతు వేదికల నుంచి జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పలువురు ఎమ్మెల్యేలు ఆన్లైన్లో పాల్గొన్నారు.


