సాక్షి, విజయనగరం జిల్లా: కూటమి పాలనపై పోరాటం చేసే సమయం ఆసన్నమైందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి సర్కార్.. జిత్తులమారి ప్రభుత్వం.. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు ప్రజలను మోసం చేస్తోందంటూ ఆయన మండిపడ్డారు. గురువారం ఆయన గజపతినగరంలో వైఎస్సార్సీపీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి కొంతమంది మీడియా సంస్థలు కొమ్ము కాస్తున్నాయంటూ ఆయన దుయ్యబట్టారు.
సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. అమ్మ ఒడి జాడ లేదు. వితంతు పెన్షన్లు ఇవ్వడం లేదు. ‘‘నేడు గ్రామాల్లో ఉపాధి హామీ పూర్తి స్థాయిలో అమలవుతుందా?. నేడు పొదుపు గ్రూపులో సున్నా వడ్డీ వస్తుందా?. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. మెడికల్ కాలేజీలు ప్రైవేట్పరం చేస్తే పేదవాడి ఆరోగ్యం ఏమవ్వాలి? నాడు వైఎస్ జగన్ పాలనలో అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇచ్చారు’’ అని బొత్స గుర్తు చేశారు.


