తెలంగాణ నీళ్లు కర్ణాటకకు ధారాదత్తం | BJP Leader Ramchandra Rao Comments On Congress Govt | Sakshi
Sakshi News home page

తెలంగాణ నీళ్లు కర్ణాటకకు ధారాదత్తం

Jun 5 2026 2:33 AM | Updated on Jun 5 2026 2:33 AM

BJP Leader Ramchandra Rao Comments On Congress Govt

‘మీట్‌ ది ప్రెస్‌’లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

డీకే శివకుమార్‌ ప్రభుత్వానికి రేవంత్‌ సర్కార్‌ నజరానా 

రాహుల్‌గాంధీ మెప్పు పొందేందుకే కోరకుంటకు నీటి సరఫరా 

నీళ్లు, నిధులు, నియామకాల సాధనలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ప్రభుత్వాల వైఫల్యం 

తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు రెండు పార్టీల ప్రయత్నం 

తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఖాయమన్న రాంచందర్‌రావు 

పవన్‌కల్యాణ్‌ మీటింగ్‌కు అనుమతి ఇచ్చి ఉంటే సరిపోయేదని వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా ఏర్పడిన డీకే శివకుమార్‌ ప్రభుత్వానికి రేవంత్‌ సర్కార్‌ తెలంగాణ నీటి వాటా ధారాదత్తం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. కృష్ణా జలాల్లో కర్ణాటకకు అదనపు వాటా లేకపోయినా రాయచూర్‌ వద్ద నిర్మిస్తున్న కోరకుంట ప్రాజెక్టుకు నీటి సరఫరాకు అంగీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంతకం చేసిందన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మెప్పు పొందేందుకే డీకే శివకుమార్‌ సీఎం కాగానే రేవంత్‌ ఈ బహుమతినిచ్చారని విమర్శించారు. బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చే వాతావరణం ఏర్పడడంతో..మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందేందుకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నాయని అన్నారు. తెలంగాణ ప్రధాన లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామకాల సాధనలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందాయని ధ్వజమెత్తారు. అభివృద్ధిపై కేటీఆర్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నానని, రెండు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పర్యటించి వచ్చి మాట్లాడదామా? అని అన్నారు. గురువారం హైదరాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ‘12 ఏళ్ల తెలంగాణ: ఆకాంక్షల సాధన– భవిష్యత్‌ ప్రయాణం’పై నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’కార్యక్రమంలో రాంచందర్‌రావు పాల్గొన్నారు. ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు ఎస్‌.విజయ్‌కుమార్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేశ్‌ నేతృత్వంలో సీనియర్‌ జర్నలిస్ట్‌ ఉమా సుదీర్‌ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించగా.. రామచందర్‌రావు మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 

దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడం వల్లే.. 
కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో గత, ప్రస్తుత ప్రభుత్వాలకు స్పష్టమైన పాలసీ లేకుండా పోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ సర్కార్‌ రూ.1.30 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినా ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు అంటూ ప్రకటనలు చేస్తోంది. తాగు, సాగునీటిపై దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడం వల్లే మన నీళ్లు ఇతర రాష్ట్రాలకు మళ్లుతున్నాయి.  

అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా 
గతంలో బీఆర్‌ఎస్, ఇప్పుడు కాంగ్రెస్‌కు అవకాశమిచ్చిన ప్రజలు ఈసారి కచ్చితంగా బీజేపీకి అధికారం కట్టబెట్టాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీ వ్యతిరేక ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కేవలం హిందూ సమాజం అంశాన్నే ఎజెండాగా తీసుకోదు. అభివృద్ధి, సుపరిపాలన, ప్రజా సంక్షేమమే మా ప్రధాన ఎజెండా. గతంలో ఒక్క వార్డులో కూడా గెలవని త్రిపురలో ఇంకా హర్యానా, అస్సాంలలో మూడేసి సార్లు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌లలో గెలిచిన బీజేపీ తెలంగాణలోనూ గెలిచి డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ను ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ సాధనలో బీజేపీ చరిత్రాత్మకమైన పాత్రను పోషిస్తే, బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ సెంటిమెంట్‌ డ్రామాలు ఆడుతున్నాయి. ఢిల్లీ స్థాయిలో తెలంగాణ బిల్లు రూపకల్పన, సవరణల ప్రక్రియలో నేను ప్రత్యక్షంగా భాగస్వామినయ్యా.  

పార్టీ నేతల మధ్య విభేదాల్లేవు.. 
అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌ శివార్లలోని రామోజీ ఫిల్మ్‌సిటీని లక్ష నాగళ్లు పెట్టి దున్నిస్తామని చెప్పి, ఆ తర్వాత తెలంగాణ వ్యతిరేకులను బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో, సీపీఎం పార్టీలతో బీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఎందుకు పొత్తు పెట్టుకుంది? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్వయంగా ప్రభుత్వమే ఆందోళన వ్యక్తం చేయాల్సి రావడం దురదృష్టకరం. బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, అర్వింద్‌ ధర్మపురి సహా ఎవరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. సోషల్‌ మీడియాలో ’కాక్రోచ్‌ జనతా పార్టీ’ లాంటి దు్రష్పచారాల వెనుక అర్బన్‌ నక్సల్స్‌ శక్తులు పనిచేస్తున్నాయి. 

ఏపీ, తెలంగాణలోని రాజకీయ విధానాలు, అంశాలు, రాజకీయ ఎజెండా వేర్వేరుగా ఉంటాయి. వచ్చే జీహేచ్‌ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఎన్నికల విధానాలు, పొత్తులు వంటివి జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది. హైదరాబాద్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ సభకు అనుమతినిస్తే సరిపోయేది. ఎలాంటి వివాదానికి ఆస్కారం ఉండేది కాదు. హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ఇళ్లకు ప్రధాని మోదీ వెళ్లినప్పటి నుంచి రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.   

Advertisement
 
Advertisement
Advertisement