Manish Sisodia: ప్రభుత్వాలను కూల్చేందుకు పెట్టిన శ్రద్ధ స్కూళ్లు, ఆస్పత్రులపై పెట్టండి

BJP Acting Like Serial Killer Eliminate State Governments Manish Sisodia - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు కమలం పార్టీ నేతలు సీరియల్ కిల్లర్లలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన బీజేపీపై ఫైర్ అయ్యారు.

సీబీఐ తన నివాసంలో 14 గంటల పాటు సోదాలు చేసినప్పుడు అధికారులు తన దుస్తులు, పిల్లల దుస్తులు కూడా వెతికారని సిసోడియా తెలిపారు. తనిఖీల్లో వాళ్లకు ఏమీ దొరకలేదని పేర్కొన్నారు. సీబీఐ తనపై  నమోదు చేసిన ఎఫ్‌ఐర్‌ మొత్తం ఫేక్ అన్నారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సభాముఖంగా తెలిపారు.

అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వాలను ఖూనీ చేసేందుకు బీజేపీ నేతలు చాలా శ్రమిస్తున్నారని, ఆ శ్రద్ధ ఏదో స్కూళ్లు, ఆస్పత్రుల నిర్మాణంపై పెట్టాల్సిందని సిసోడియా హితవుపలికారు. ఇతరులు మంచి పనులు చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ అభద్రతాభావానికి లోనవుతున్నారని సిసోడియా విమర్శలు గుప్పించారు. అలాంటి వ్యక్తిని తాను చూడలేదన్నారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని అయి ఉంటే మోదీలా చేసేవారు కాదని సిసోడియా అన్నారు. 

ఢిల్లీ ప్రభుత్వం విత్‌డ్రా చేసుకున్న ఎక్సైజ్‌ పాలసీని సిసోడియా సమర్థించారు. దాని వల్ల ప్రజలపై ఎలాంటి భారం పడలేదని, ప్రభుత్వ ఆదాయం కూడా పెరిగిందని సిసోడియా పేర్కొన్నారు. కానీ బీజేపీ మాత్రం ఇంకా దాంట్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తోందని మండిపడ్డారు.

వీడియో రికార్డు
అంతకుముందు ఢిల్లీ అసెంబ్లీలో ఫోన్‌తో వీడియో రికార్డు చేశారు  బీజేపీ ఎమ్మెల్యే అజయ్ మహావర్. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లా.. సభ నియమాలను ఉల్లంఘించి వీడియో తీసినందుకు మీ ఫోన్ ఎందుకు సీజ్ చేయకూడదో చెప్పండి అని ప్రశ్నించారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలను ఒక రోజు సస్పెండ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ  బయట నిరసన వ్యక్తం చేశారు.
చదవండి: కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌.. పార్టీకి ఆజాద్‌ రాజీనామా.. రాహుల్‌పై ఫైర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top