● రూ.15 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం
● శరవేగంగా శైవక్షేత్రం అభివృద్ధి పనులు
● గుడి చుట్టూ సీసీ రహదారుల నిర్మాణం
ఓదెల: ప్రముఖ శైవక్షేత్రం ఓదెల మల్లికార్జునస్వామి ఆలయం అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. శ్రీశైలం తరహాలో పనులకు శ్రీకారం చుట్టారు. ప్రతీ ఆది, బుధవారాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. వారికి అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేయడంతోపాటు భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.
చేపట్టిన పనులు ఇవే..
● ఆలయం ఎదుట బీటీరోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. సెంట్రల్ లైటింగ్ సిస్టంతో ఏర్పాటు చేయడంతో వెలుగులు విరజిమ్ముతున్నాయి.
● రూ.కోటి 30లక్షల వ్యయంతో ఆలయం చుట్టూ చేపట్టిన సీసీ రోడ్ల పనులు చకాచకా కొనసాగుతున్నాయి.
● భక్తులు బసచేసేందుకు వీలుగా దాతల సాయంతో మరో ఆలయంలో 22 గదుల నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేశారు.
● ఆలయ ఆవరణలో మహిళలు, భక్తుల కోసం చేపట్టిన మూత్రశాలలు, మరగుదొడ్ల నిర్మాణం చివరి దశకు చేరింది.
● స్వయంభూగా వెలసిన ఓదెల మల్లన్నస్వామి ఆలయ ప్రాకారం, ఆలయాన్ని శ్రీశైలం నమూనాలతో స్థపతి, వాస్తు ప్రకారం పున:నిర్మాణం త్వరలో చేపడుతున్నారు.
● ఇందుకోసం ప్రభుత్వం ఇటీవలే రూ.15కోట్లు మంజూరు చేసింది.
● స్వామివారి దర్శనం కోసం వచ్చే వీఐపీల కోసం ఆధునిక పద్ధతుల్లో గెస్హౌస్ నిర్మించనున్నట్లు సమాచారం.


