రామగిరి: మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. నాగేపల్లి గ్రామంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్ నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు తనపై అనేక కేసులు పెట్టించడంతోపాటు చివరకు రౌడీషీట్ ఓపెన్ చేయించిన కీర్తి దుద్దిళ్లకే దక్కుతుందని, ప్రస్తుతం ప్రజల పక్షాన బీఆర్ఎస్ నాయకత్వం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పూదరి సత్యనారాయణపై 20కేసులు పెట్టించాడని ఆరోపించారు. భవిష్యత్లో తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఈ కేసులపై సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అద్యక్షుడు శంకేశీ రవీందర్, మంథని కౌన్సిలర్ మాచిడి రాజుగౌడ్, నాయకులు మ్యాదరబోయిన కుమార్యాదవ్, కాపురబోయిన భాస్కర్, జాపతి శేఖర్, బొంకూరి పోచం, వేగోలపు శంకర్గౌడ్, సైండ్ల సత్యనారాయణ, సాన సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


