సాక్షి, పెద్దపల్లి:
జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవం నాటడం వరకే పరిమితమవుతోంద నే విమర్శలకు దారితీస్తోంది. ఏటా రూ.కోట్లు వెచ్చి స్తూ శాఖల వారీగా లక్ష్యం నిర్దేశిస్తున్నా ఆశించిన స్థాయిలో నెరవేరడంలేదు. ఈ ఏడాది 27.58 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా.. వర్షాలు ప్రారంభమైన తర్వాత కూడా నాటడం ఊపందుకోలేదు. ఇప్పటికే పదిరోజులుగా అనుకూల వర్షా లు కురుస్తున్నాయి. వివిధ శాఖలు సమన్వయంతో మొక్కల నాటడాన్ని వేగవంతం చేయాలని పర్యావరణవేత్తలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
5న వనమహోత్సవం ప్రారంభం
జూన్ 5న కలెక్టర్ శ్రీహర్ష వనమహోత్సవం ప్రారంభించారు. వర్షాభావంతో నాటే ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రస్తుతం వాతావరణం అనుకూలంగా మారినా ప్రభుత్వ శాఖల్లో కదలిక క నిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈసారి 8 లక్షల మొక్కలను నివాసాల వద్ద నాటేలా పంపిణీ చేయనుండగా, మిగిలిన వాటిని 28 ప్రభుత్వ శాఖలకు కేటాయించారు. రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటే షన్, ప్రభుత్వ భూములు, అటవీ ప్రాంతాలు, కా ర్యాలయాలు, విద్యాసంస్థల్లో నాటేలా కార్యాచరణ రూపొందించారు. డీఆర్డీవోకు అత్యధికంగా 14.20 లక్షలు, మున్సిపల్కు 6.50 లక్షలు, పరిశ్రమల శాఖకు 4.50 లక్షలు, వ్యవసాయ శాఖకు లక్ష మొక్కల లక్ష్యం కేటాయించారు.
260 నర్సరీలు సిద్ధం..
మొక్కల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా 260 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేశా రు. డీఆర్డీవో ఉపాధిహామీ ద్వారా నిర్వహిస్తోంది. అటవీశాఖ పరిధిలో మరో 20కిపైగా ఉన్నాయి. నీడనిచ్చే వాటితోపాటు జామ, నిమ్మ, ఉసిరి, దానిమ్మ, చింత, అల్లనేరేడు వంటి పండ్ల మొక్కలు, గులాబీ, మందార, గన్నేరు వంటి పూలమొక్కలు పెంచుతున్నారు. ఉపాధిహామీ ద్వారా సుమారు 80 వేల గుంతలు తవ్వి మొక్కల నాటేందుకు ఏర్పాట్లు కూడా పూర్తిచేశారు. గీత కార్మికులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ఈసారి 3వేల ఈత, 420 తాటిమొక్కలూ నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది.
బతికించడమే కీలకం
మొక్కలు నాటడమేకాదు.. సంరక్షణకూ ప్రాధా న్యం ఇవ్వాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. గతంలో నాటినవాటిలో అత్యధికంగా ఎండిపోవ డం, సంరక్షణ లేక నష్టపోవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతీ మొక్కకు ట్రీగార్డు, ముళ్లకంచె ఏర్పా టు చేయడంతోపాటు, హరిత రక్షణ కమిటీలతో నిరంతర పర్యవేక్షించాలని కోరుతున్నారు.
జిల్లాలో 27.58 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం
వర్షాలు ఆరంభమైనా పుంజుకోని వనమహోత్సవం
ఇప్పటికే నాటిన వాటి సంరక్షణపై తీవ్ర నిర్లక్ష్యం
అధికారుల్లో కనిపించని ఆనాటి ఉత్సాహం
ఎండిపోయిన ఈ మొక్కలు రామగుండం నగరంలోని శారదానగర్ వాటర్ట్యాంకు ఆవరణలోనివి. ఎండల తీవ్రతకు తోడు, సంరక్షణ చేపట్టక ఇలా నిర్జీవంగా మారిపోయాయి.


