మంథనిరూరల్: రైతులకు రాయితీపై అందించే ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలనే ఆలోచనతో గత ప్రభుత్వం మంథని మండలం వెంకటాపూర్లో నిర్మించిన మానేరు గోదాం నిరుపయోగంగా మారిపోతోంది. తూర్పున ఉన్న ఏడు గ్రామపంచాయతీల పరిధిలోని అన్నదాతలకు ఉపయోగపడేలా గోదాం నిర్మించారు. వానాకాలం, యాసంగి సీజన్లలో ప్రభుత్వం సబ్సిడీపై అందించే ఎరువులు, విత్తనాలను ఇందులో తొలుత నిల్వ చేసేలా ఏర్పాట్లు చేశారు. గోదాం నిర్వహణపై పీఏసీఎస్ పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆరేళ్లుగా అలంకారప్రాయంగానే మిగిలిపోయింది.
రూ.35లక్షల వ్యయంతో..
బీఆర్ఎస్ హయాంలో 2018లో రూ.35లక్షల వ్యయంతో పీఏసీఎస్ మానేరు గోదాం నిర్మించారు. అదేఏడాది రైతులకు అందుబాటులో ఉంచిన ఎరువులు, విత్తనాలు పంపిణీ చేశారు. ఆ తర్వాత పీఏసీఎస్ పాలకులు, సహకార అధికారులు గోదాం నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
ఇద్దరు ఉద్యోగుల నియామకం
మానేరు గోదాం ప్రారంభించిన తర్వాత దాని నిర్వహణకు ఇద్దరు ఉద్యోగులను నియమించారు. రెండేళ్లపాటు సజావుగా నిర్వహించిన తర్వాత.. ఎరువు లు, విత్తనాల పంపిణీపై పీఏసీఎస్ పాలకులు పట్టించుకోలేదు. ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులను మంథని పీఏసీఎస్కు బదిలీ చేశారు. వారు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.
రైతులకు తీరని నష్టం
ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుండగా.. గోదాం నిర్వహణ సరిగా లేక రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యూరియా, డీఏపీ, 20:20 లాంటి ఎరువులతోపాటు ఇతర విత్తనాల నూ ప్రభుత్వం రాయితీపై అందిస్తోంది. గోదాంకు ప్రతీసీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు తీసుకువచ్చి అందజేయాలి.
లక్షలు వెచ్చించి.. లక్షణంగా వదిలేసి..
రైతులకు అందుబాటులోలేని గోదాం
ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు
ఆరేళ్లుగా అలంకారప్రాయంగా పీఏసీఎస్ గోదాం


