పెద్దపల్లి: మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం చెల్లించకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం హెచ్చరించారు. మధ్యాహ్న భోజన కార్మికులు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి సునీల్, మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి పూసల రమేశ్తో కలిసి కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా చేశారు. ఆయన మాట్లాడుతూ, ఒక్కో కార్మికుడికి నెల కనీస గౌరవ వేతనం రూ.26,000 చెల్లించాలన్నారు. కార్యక్రమంలో కార్మికులు, నాయకులు లావణ్య పి.కళావతి, రాధమ్మ, పిడుగు గట్టయ్య, లంక విజయ, కనకలక్ష్మీ, మేకల యశోద, ఎండీ జుబేదార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం డీఈవో శారదకు వినతిపత్రం అందజేశారు.
సర్కారు బడుల్లో సౌకర్యాల్లేవ్
గోదావరిఖనిటౌన్: ప్రభుత్వ పాఠశాల్లో సౌకర్యాలు లేవని సీపీఎం కేంద్రకమిటీ సభ్యుడు ఎస్.వీరయ్య విమర్శించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలను మంగళవారం పరిశీలించారు. బడి పైకప్పు శిథిలమై ప్రమాదకంగా ఉందని, వర్షపునీరు ఉరుస్తోందని, ఆర్వో వాటర్ ప్లాంట్ పనిచేయడం లేదన్నారు. టాయిలెట్లు దుర్గంధం వెదజల్లుతున్నాయని తెలిపారు. వంటగదిలో సిమెంటు బస్తాలు నిల్వ చేశా రని, ఇలాంటి వాతావరణంలో విద్యార్థులు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.


