కోల్ సిటీ(రామగుండం): ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు ‘హ్యాపీ సండే’ కార్యక్రమం ఉపయోగపడుతుందని రామగుండం మేయర్ మహంకాళి స్వామి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. మార్చిలో గోదావరినది పరిసరాల్లో శుభ్రత కార్యక్రమం చేపట్టిన అనంతరం హ్యాపీ సండేను ఘనంగా నిర్వహించామని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రజలు డిజిటల్ స్క్రీన్లకు ఎక్కువగా అలవాటు పడటంతో యోగా, క్రీడలు వంటి ఆరోగ్యకర కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గుతోందన్నారు. దీంతో అనారోగ్య సమస్యలు పెరిగి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతోందని, నగరంలోని మైదానాల్లో వ్యాయామం, వాకింగ్ చేసే వారి సంఖ్య పెరగడం శుభపరిణామమన్నారు. రామగుండాన్ని ఆరోగ్యవంతమైన నగరంగా తీర్చిదిద్దే లక్ష్యానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్ల య్య మాట్లాడుతూ, అభిదృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. యోగా ప్రదర్శన, కబడ్డీ, మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అదనపు కలెక్టర్, కమిషనర్ జె.అరుణశ్రీ, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ పాల్, ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మధుకర్, మెప్మా టీఎంసీ మౌనిక, యోగా గురు గణేశ్, వ్యాయామ ఉపాధ్యాయులు శోభారాణి, తిరుపతి, దావీద్ తదితరులు పాల్గొన్నారు.


