
‘ఆటోమేటిక్’గా పట్టేస్తాయి
జిల్లాలో నమోదైన కేసులు, జరిమానాలు
గోదావరిఖని: జిల్లాలో విస్తరించిన రహదారులపై నిత్యం ఏదోఒకచోట రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. ప్రధానంగా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి నుంచి గోదావరిఖనిలోని గంగానగర్ సమీప గోదావరి వంతెన వరకు, గోదావరిఖని నుంచి మంథని వరకు, పెద్దపల్లి నుంచి మంథని వరకు, పెద్దపల్లి నుంచి ధర్మారం వరకు గల రోడ్లు అత్యంత ప్రమాదకరంగా మారాయి. కొందరు ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు శాశ్వతంగా అంగవైకల్యం పాలవుతున్నారు. అతివేగం, ట్రా ఫిక్ నిబంధనలు అతిక్రమించడంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు వివ రిస్తున్నారు. అయితే, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబంధిత శాఖ అధికారులు ఇప్పటికే బ్లాక్స్పాట్లు గుర్తించారు. అక్కడ సైన్బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. వేగ నియంత్రణ కోసం స్పీడ్గన్లు ఏర్పాటు చేశారు. వీటిద్వారా సత్ఫలితాలు వస్తున్నా.. లక్ష్యం నెరవేరడం లేదు. ఈఏడాది జరిగినలో జరిగిన 79 సీరియస్ ప్రమాదాల్లో 88 మంది మృతి చెందారు.
సమన్వయంతో ముందుకు..
ట్రాఫిక్ పోలీసులు, రోడ్డు భద్రతా అధికారులు సమన్వయంతో ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా అవగాహన కల్పిస్తున్నారు. పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థి దశనుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ఉంటే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందనే భావనతో ఈ నిర్ణయానికి వచ్చారు.
బహుముఖ వ్యూహం
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ట్రాఫిక్ పోలీసు లు బహుముఖ వ్యూహం అవలంబిస్తున్నారు. ప్రధాన ప్రాంతాల్లో ఆటోమెటిక్గా జరిమానా విధించే 12 ఆటో క్యాప్చర్ కెమెరాలు అమర్చి 58,442 కేసులు నమోదు చేశారు. రూ.1.40 కోట్లు జరిమానా విధించారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల ద్వారా 6,413 కేసులు నమోదు చేసి, 4,562 మందిని కోర్టులో హాజరు పర్చారు. వాహనదారులకు రూ.61.50 లక్షల జరిమానా విధించారు. ఇందులో 17మందికి జైలుశిక్ష కూడా పడింది.
నిబంధనలు పాటించినవారికి నజరానా..
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. రూల్స్ను కచ్చితంగా పాటిస్తున్న వాహనదారులకు నజరానా అందిస్తున్నారు. ఈక్రమంలో వారం క్రితం స్పెషల్ డ్రైవ్ నిర్వహంచి మహిళా బైక్ రైడర్లకు చీరెలు బహుమతిగా అందజేశారు.
ప్రధాన రహదారులపై స్పీడ్గన్లు
రహస్య కెమెరాలతోనూ నిఘా
నిత్యం డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
అధికారుల బహుముఖ వ్యూహం
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం
ప్రధాన రోడ్లపై నిఘా
జిల్లాలోని మెయిన్ రోడ్లన్నింటిపైనా నిఘా ఉంది. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నాం. పాటించే వారిని అభినందిస్తూనే, అతిక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ట్రాఫిక్ విభాగం పనిచేస్తోంది.
– సీహెచ్ శ్రీనివాస్,
ఏసీపీ, ట్రాపిక్, రామగుండం
డ్రంకెన్ డ్రైవ్ 6,413
కోర్టులో హాజరు పరిచినవి 4,562
విధించిన జరిమానా(రూ.లక్షల్లో) 61.50
జైలుశిక్ష పడిన వారిసంఖ్య 17
లేజర్ గన్ నమోదుచేసిన కేసులు 12,086
విధించిన జరిమానా(రూ.కోట్లలో) 1.25
ఆటోమేటిక్ కెమెరా కేసులు 58,442
విధించిన జరిమానా(రూ.కోట్లలో) 1.40
ఈ చలానా కేసులు 2,60,364
విధించిన జరిమానా(రూ.కోట్లలో) 8.06
ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు 226
గాయపడిన వారిసంఖ్య 335
ప్రమాదకరమైన యాక్సిడెంట్లు 79
మరణించిన వారిసంఖ్య 88
నిఘా కెమెరాలు
స్పీడ్ లిమిట్ లేజర్ గన్లు 2
ఆటోమెటిక్ చలానా కెమెరాలు 12
సీసీ కెమెరాలు(సుమారు) 5,500

‘ఆటోమేటిక్’గా పట్టేస్తాయి