
రైతు భరోసా పంపిణీ
సుల్తానాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, కరెంట్, సబ్సిడీ ద్వారా గ్యాస్, మహిళలకు రూ.15లక్షల వరకు రుణాలు, ఉచిత రేషన్ బియ్యం పంపిణీతోపాటు వానాకాలం సీజన్లో సన్న వడ్లకు క్వింటాలుకు బోనస్ రూ.500ను రైతు ఖాతాలో నేరుగా జమ చేసింది. ఇటీవల రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. పథకం ద్వారా పంట పెట్టుబడి కోసం రైతులకు నేరుగా ఆర్థిక సాయమందిస్తారు. దీని ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు ఇతర వ్యవసాయ ఖర్చుల కోసం ఇతరులపై ఆధారపడకుండా తమ అవసరాలను తీర్చుకోగలుగుతారు.
రైతు ఖాతాలో జమ
జిల్లాలో రైతు భరోసా పెట్టుబడి సాయం రైతుల ఖాతాలో జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి తెలిపారు. వానాకాలం 2025–26 సంవత్సరం మంగళవారం నాటికి జిల్లాలో 1,01,397 మంది రైతులకు రూ.54,70,63,881 ఖాతాల్లో జమ కాగా.. బుధవారం 21,119 మంది రైతుల ఖాతాల్లో రూ.31,23,37,920 జమ చేసినట్లు వివరించారు. జిల్లాలో మొత్తం 1,22,516 మంది ఖాతాలో రూ.85,94,01,801 జమైనట్లు తెలిపారు.
20 లోపు..
ఈనెల 20 లోపు నూతనంగా వచ్చిన రైతులందరూ రైతు పట్టాదారు పాసు పుస్తకంతోపాటు మీసేవకు లింకై న ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్ను సంబంధిత ఏఈవోలకివ్వాలి. లింకై న తర్వాత వారికి సైతం వారివారి ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు పడనున్నాయి.
ఎన్నికల ప్రభావం
సాధారణంగా ఎన్నికలకు ముందు ప్రభుత్వాలు ఇలాంటి ప్రజాకర్షణ పథకాలను అమలు చేయడం చూస్తుంటాం. ఓటర్లను ఆకట్టుకోవడానికి.. తమ ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక చర్యగా భావిస్తారు. రైతు భరోసా పథకం మెజారిటీ ఓటర్లయిన రైతులను లక్ష్యంగా చేసుకున్నందున.. ఇది రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వానికి గణనీయమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మండలాలవారీగా రైతుల ఖాతాల్లో జమైన నిధులు
జిల్లాలో రైతులు 1,22,516 మొత్తం సాయం రూ.85,94,01,801
మండలం రైతుల సంఖ్య రూపాయలు
కమాన్పూర్ 4,688 3,16,79,164
మంథని 12,016 9,20,43,408
ముత్తారం 6,416 5,16,22,052
రామగిరి 4,817 3,56,46,250
ఎలిగేడు 5,982 4,10,53,524
జూలపల్లి 8,526 5,71,12,773
ఓదెల 11,119 8,24,29,519
పెద్దపల్లి 17,461 11,84,86,340
శ్రీరాంపూర్ 10,812 8,40,45,947
సుల్తానాబాద్ 13,174 8,73,66,114
అంతర్గాం 4,770 3,24,87,052
ధర్మారం 14,770 9,45,22,267
పాలకుర్తి 6,362 4,19,08,842
రామగుండం 1,603 89,98,549
రైతు ఖాతాలో జమ
జిల్లావ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమవుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి 5 గుంటలు మొదలుకొని రెండు ఎకరాల విస్తీర్ణం వరకున్న వారికి జమయ్యాయి.
– ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి, పెద్దపల్లి
పెట్టుబడికి దోహదం
రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమయ్యాయి. పెట్టుబడి సాయానికి దోహదపడనున్నాయి. ప్రభుత్వం నిర్ణయం హర్షణీయం. ప్రభుత్వానికి రైతులు అండగా నిలుస్తారు.
– గరిగే శ్రీనివాస్, రైతు, సుల్తానాబాద్

రైతు భరోసా పంపిణీ