
ఆపరేషన్ ‘మంకీ’!
● వనం వదలి జనంలోకి వస్తున్న వానరాలు ● కోతుల బెడద నివారణకు రూ.10లక్షలు ● బల్దియాలో కోతులను పట్టుకుంటున్న ఏజెన్సీ సిబ్బంది ● అడవులు అంతరించడంతో ఇళ్లలోకి ● సంరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్
కోల్సిటీ(రామగుండం): వనం వదిలి వానరాలు జనంలోకి వస్తున్నాయి. ఇటీవల రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోకి వందలాది వానరాలు వచ్చి ప్రజలకు భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. కోతుల బెడద అరికట్టాలని ప్రజల నుంచి ఫిర్యాదులు భారీగా రాగా దీంతో బల్దియా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వారం రోజులుగా వానరులను బంధించి సమీప జిల్లాల్లోని దట్టమైన అడవుల్లో వదిలేస్తున్నారు.
ఇళ్లలోకి చొరబడి
వనాల్లో ఉండాల్సిన కోతులు నగరంలోని జనవాసాల్లోకి చేరి గుంపులు గుంపులుగా తిరుగుతూ జనాలపై దాడి చేస్తున్నాయి. ఇళ్లల్లో చొరబడి వీరంగం సృష్టిస్తున్నాయి. ఇళ్లు, దుకాణాల్లోని తినుబండారాలు, వస్తువులను ఎత్తుకెళ్తున్నాయి. కూరగాయలు, ఇళ్లలోని ఆహార పదార్థాలు, వస్తువులు చిందర వందర చేస్తున్నాయి. కోతుల దాడిలో చాలామంది గాయపడుతున్నారు.
బల్దియాకు ఫిర్యాదులు
నగరంలోని రామగుండం, గాంధీనగర్, తిలక్నగర్, రమేశ్నగర్, పవర్హౌజ్కాలనీ, విద్యానగర్, ఐబీ కాలనీ, జవహర్నగర్, ఎల్కలపల్లి గేట్, అన్నపూర్ణకాలనీ తదితర ప్రాంతాల్లో కోతుల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోతుల బెడదను అరికట్టాలంటూ బల్దియాకు ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి.
వానరుల బెడదకు చెక్..
బల్దియాలో వానరుల బెడదకు చెక్ పెట్టేందుకు కలెక్టర్, బల్దియా స్పెషలాఫీసర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు, నగరపాలక కమిషనర్(ఎఫ్ఏసీ) జె.అరుణశ్రీ చర్యలు చేపట్టారు. రూ.10లక్షల అంచనాలతో టెండర్ పిలిచిన అధికారులు, హైదరాబాద్కు చెందిన ఓ కాంట్రాక్టర్కు కోతులను పట్టుకునే పనులు అప్పగించారు.
స్పెషల్ డ్రైవ్..
నగరంలోని డివిజన్లలో కోతులు పట్టుకునేందుకు వారం రోజులుగా టెండర్ పొందిన ఏజెన్సీ ప్రతినిధులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. కోతులు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని ముందుగా ఎంచుకొని వాటిని బోన్లల్లో బంధిస్తున్నారు. సమీపంలోని చెన్నూరు, కాటారం తదితర దట్టమైన అడవులకు జీపీఆర్ సిస్టం కలిగిన ప్రత్యేక వాహనాల్లో తరలించి వదిలేస్తున్నారు.
కాల్ సెంటర్ ద్వారా ఫిర్యాదులు
నగరంలో కోతుల కట్టడికి బల్దియా అధికారులు కాల్ సెంటర్ 960 3666 444 ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. కోతుల బెడద ఎక్కువగా ప్రాంతాలపై సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రతీ రోజూ కోతులను పట్టుకునే ప్రక్రియపై పర్యవేక్షణ చేపట్టేందుకు, సిబ్బందిని కూడా కమిషనర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

ఆపరేషన్ ‘మంకీ’!