
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
పెద్దపల్లి రూరల్/సుల్తానాబాద్: ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. అభివృద్ధి పనులపై కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో గురువారం సమీక్షించారు. రామగుండం జెడ్పీహెచ్ఎస్కు రూ.40 లక్షల సీఎస్సార్ నిధులు ఉన్నాయని, పనులు ప్రారంభించాలని అన్నారు. ఇందుకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తీర్మానాలు తీసుకోవాలని అన్నారు. జూనియర్ కళాశాల అభివృద్ధికి నిధులు ఉన్నందున వారంరోజుల్లో పనులు ప్రారంభించాలన్నారు. జిల్లాకేంద్ర ఆసుపత్రి పనులు గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరిఖని జనరల్ ఆసుపత్రి ఫస్ట్ ఫ్లోర్ మరమ్మతు పూర్తి చేసినట్లు సర్టిఫికెట్ సమర్పిస్తే చెల్లింపులు పూర్తి చేస్తామని తెలిపారు. జీజీహెచ్ గ్రౌండ్ ఫ్లోర్లో రూ.98 లక్షలతో మరమ్మతు చేపట్టామన్నారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు
సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. డయేరియా నియంత్రణపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఐదేళ్లలోపు పిల్లల్లో డయేరియా నియంత్రణకు తీసుకునే చర్యలపై డీఎంహెచ్వో వివరించారు. అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. డ్రైనేజీల్లో ఆయిల్ బాల్స్ వేయాలని అన్నారు. గురుకులాలు, హాస్టళ్లలో వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది రెగ్యులర్గా విజిట్ చేయాలని సూచించారు. గ్రామాల్లో ఫాగింగ్ చేపట్టాలన్నారు. రామగుండం ప్రాంతంలో మరింత సమర్థవంతంగా వైద్య సేవలు అందించాలన్నారు. క్రిటికల్ కేసులను గోదావరిఖని జనరల్ ఆసుపత్రికి రెఫర్ చేయాలని తెలిపారు. డయాబెటిస్ను తేలికగా తీసుకుంటే వచ్చే నష్టాలను ప్రజలకు వివరించాలన్నారు. అనుమతి లేకుండా వైద్యులు, నర్సు, ఏఎన్ఏంలు గైర్హాజరు కావద్దన్నారు. కార్యక్రమాల్లో డీఎంహెచ్వో అన్నప్రసన్న కుమారి, అధికారులు పాల్గొన్నారు.
21న యోగా దినోత్సవం
ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయూష్ విభాగం ఆధ్వర్యంలో కూనారం రోడ్డులోని ఆర్కే గార్డెన్లో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీనినివిజయవంతం చేయాలని సూచించారు.
● కలెక్టర్ కోయ శ్రీహర్ష