పల్లెపోరు కలిసొచ్చేనా.. | - | Sakshi
Sakshi News home page

పల్లెపోరు కలిసొచ్చేనా..

Jun 21 2025 3:45 AM | Updated on Jun 21 2025 3:45 AM

పల్లెపోరు కలిసొచ్చేనా..

పల్లెపోరు కలిసొచ్చేనా..

● స్థానిక సమరంపై మంత్రుల ప్రకటనలతో.. ● ఆశావహుల చూపు.. రిజర్వేషన్ల వైపు ● రిజర్వేషన్‌ కొనసాగింపుపై స్పష్టత కరువు ● పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్న ఆశావహులు

సాక్షిపెద్దపల్లి: ‘అన్న.. ఎన్నికలు నోటిఫికేషన్‌ వస్తుందంటావా? ముందు పరిషత్‌ ఎన్నికలు వస్తాయా? లేదా సర్పంచ్‌ ఎన్నికలు వస్తాయా? పాత రిజర్వేషన్లు కొనసాగిస్తారా.. లేక కొత్తవి ప్రకటిస్తారా..? రిజర్వేషన్‌ మారితే కలిసొచ్చేనా’.. అంటూ గ్రామాల్లో ఎక్కడ చూసినా స్థానిక సంస్థల ఎన్నికల ముచ్చట్లే వినిపిస్తున్నాయి. పల్లె పోరుకు ఎప్పుడు తెర లేస్తుందన్న దానిపై గ్రామాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పంచాయతీలను కొద్దికాలంగా ప్రత్యేకాధికారుల పాలనతో నెట్టుకొస్తుండగా.. తాజాగా కొందరు మంత్రులు చేస్తున్న ప్రకటనలతో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది. రైతుభరోసా, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ, రూ.10లక్షల లోపు పనులకు నిధుల మంజూరు, ఇందరమ్మ ఇళ్ల పంపిణీ తదితరలు చూస్తుంటే ఎన్నికల వాతావరణం దగ్గరపడుతోందని ఆశావహులు విశ్లేషించుకుంటున్నారు. ఇప్పటికే మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లీకులు ఇవ్వడంతో స్థానిక పోరు ఖాయమైనట్లేనని, వచ్చే నెల మొదటివారంలో పరిషత్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది.

రిజర్వేషన్లపైనే చర్చ..

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి 50 శాతాన్ని దాటకూడదు అనే నిబంధన ఉంది. పంచాయతీ ఎన్నికలు 2019లో 27 శాతం బీసీలకు, 15 శాతం ఎస్సీలు, 6శాతం ఎస్టీలకు కేటాయించారు. మొత్తం స్థానాల్లో మహిళలకు సగం సీట్లు కేటాయించారు. గత ప్రభుత్వం పంచాయతీ రిజర్వేషన్లపై తెచ్చిన చట్టం ప్రకారం పదేళ్ల పాటు రిజర్వేషన్లు అమలులో ఉంచుకోవచ్చు. దీని ప్రకారం మరో ఐదేళ్లు పాత రిజర్వేషన్లు కొనసాగించే అవకాశం ఉంది. కానీ, కాంగ్రెస్‌ సర్కారు బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ప్రకటించింది. దీనికి అనుగుణంగా కులగణన చేపట్టింది. చట్టం రూపొందించి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపింది. కేంద్రం ఆమోదం తెలిపే అవకాశాలు లేకపోవడం, ఇప్పటికే స్థానిక సంస్థల్లో ప్రత్యేక పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం పార్టీవారీగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు పోయే అవకాశాలున్నాయనే ప్రచారంతో ఆశావహుల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది.

రంగంలోకి ఆశావహులు

ప్రధానంగా యువతరం ఈ సారి స్థానిక బరిలో ఉండేందుకు ఊవ్విళ్లూరుతోంది. పార్టీల పరంగా సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవిని ఆశించేవారంతా యాక్టివ్‌ అవుతున్నారు. తమ గ్రూపులు, వర్గాలను కూడగట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వార్డుల వారీగా ఫ్యానల్స్‌ను ఏర్పాటు చేసుకొని తమకు అనుకూలంగా వ్యవహరించే నేతలను ఆయా వార్డుల్లో గెలిపించుకోవడానికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు.

సిద్ధంగా యంత్రాంగం

జిల్లాలో 13 జెడ్పీటీసీ, 140 ఎంపీటీసీ, 263 సర్పంచ్‌, 2,474 వార్డులున్నాయి. అధికారులంతా పంచాయతీ ఎన్నికల కోసం ఓటరు జాబితాల మార్పుచేర్పు ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు పోలింగ్‌ నిర్వహణకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే ఓటరు జాబితా, బ్యాలెట్‌ బాక్సులతోపాటు నామినేషన్ల స్వీరణలో పాల్గొనే అధికారులకు శిక్షణ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతుండటంతో ఆశావహుల్లో రిజర్వేషన్‌ అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. బీసీల రిజర్వేషన్‌పై సందిగ్ధం వీడితే ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement