సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ.. ప్రజలకు నిత్యం సేవలందిస్తున్న అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో ఆర్థిక ఆందోళన పెరుగుతోంది. నెలంతా విధులు నిర్వర్తించినా.. సమయానికి జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఒకనెల జీతం ఆలస్యమైతేనే ఇబ్బందులు పడే పరిస్థితుల్లో.. నెలల తరబడి వేతనాలు పెండింగ్లో ఉండడంతో వారి కష్టాలు మరింత తీవ్రమవుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో వందలాది మంది పనిచేస్తున్నారు. కార్యాలయాల నిర్వహణ నుంచి క్షేత్రస్థాయి సేవల వరకు అనేక బాధ్యతలను వీరు నిర్వర్తిస్తున్నారు. బోధన వృత్తిలోనూ అనేక మంది ఉన్నారు. వీరికి చెల్లించాల్సిన వేతనాలు మాత్రం కొన్ని విభాగాల్లో సకాలంలో అందడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అందని రెన్యువల్ ఉత్తర్వులు
ప్రభుత్వ డిగ్రీకళాశాలల్లో పనిచేస్తున్న గెస్టు లెక్చరర్లకు 2026– 27 విద్యాసంవత్సర రెన్యువల్ ఆదేశాల ఉత్తర్వులు నేటికీ ఇవ్వలేదు. దీంతోపాటు వారికి గత మార్చి, ఏప్రిల్ నెల జీతాలు ఇప్పటికీ చెల్లించలేదు. నెలకు ఇచ్చే రూ.28 వేల వేతనం నాలుగు నెలలుగా అందకపోవడంతో కుటుంబాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. రాష్ట్రంలో దాదాపు 1,100 మందికి ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఇంటర్లో బోధించే గెస్ట్ లెక్చరర్లకు 11 నెలల వేతనాలు ఇస్తున్న ఉన్నతాధికారులు.. డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న తమకు మాత్రం 10 నెలల వేతనాన్నే ఇస్తున్నారని వాపోతున్నారు.
అప్పులతో కుటుంబాలు నెట్టుకొచ్చే పరిస్థితి
నెలవారీ వేతనంపైనే ఆధారపడే ఉద్యోగులకు జీతం ఆలస్యం కావడం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇంటి అద్దె, పిల్లల చదువులు, నిత్యావసరాలు, వైద్యం, రవాణా ఖర్చులు వంటి వాటిని నిర్వహించేందుకు చేతిలో నగదు లేక ఇబ్బందులు పడుతున్నారు. కొందరు అప్పులుచేసి కుటుంబాలను నెట్టుకొస్తుండగా.. మరికొందరు తెలిసిన వారి వద్ద, ప్రైవేటు రుణాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
● ప్రతి నెల జీతం వస్తుందన్న నమ్మకంతోనే కుటుంబ ఖర్చులు ప్లాన్ చేసుకుంటాం. కానీ జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బకాయిలు పేరుకుపోవడంతో అప్పులు పెరుగుతున్నాయంటూ పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేసి ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలి. సంబంధిత శాఖలు పెండింగ్ బిల్లులను పరిశీలించి, నిధులు విడుదలకు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ శాఖలకు సేవలందిస్తున్న వందలాది మందికి వేతనాల విషయంలో అనిశ్చితి లేకుండా ప్రతి నెలా సకాలంలో జీతాలు అందేలా శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నాం.
– ఎన్.వై.నాయుడు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి
నెలలు గడుస్తున్నా అందని వేతనాలు..
ఆర్థిక ఇబ్బందుల్లో అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు
వేతన బకాయిల కోసం ఇటీవల ఐటీడీఏ వద్ద బైఠాయించిన ఏఎన్ఏంలు


