సాక్షి, పార్వతీపురం మన్యం: అధికారం అండతో తెలుగు తమ్ముళ్లు అన్నిరకాల అసాంఘిక కార్యకలాపాలకూ తెర తీస్తున్నారు. బెట్టింగ్, జూదం, సారా తయారీ, వ్యభిచార గృహాలు.. ఇలా ఏ ఒక్కటినీ వదలడం లేదు. పార్వతీపురం పట్టణంలో అధికార పార్టీకి చెందిన ఓ ‘తమ్ముడు’ కొన్నాళ్లుగా వ్యభిచార గృహం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి, ఇక్కడ విటులకు ఎర వేస్తున్నట్లు సమాచారం. సాక్షాత్తు ఆ వెంకట రమణమూర్తి పేరు పెట్టుకుని ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా ఈ తంతు నడుస్తున్నప్పటికీ.. అధికార పార్టీ అండదండలు ఉండడంతో స్థానికులు మౌనంగా ఉండిపోయారు. ఇటీవల జిల్లా పోలీసు అధికారులు వినూత్నంగా ‘మన్యంతో మమేకం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. అందులో భాగంగా తమ వార్డుకు వచ్చిన పోలీసులకు కొంతమంది మహిళలు ఈ వ్యభిచార గృహం గుట్టును చేరవేశారని తెలిసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు ‘తమ్ముడిని’ అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికార పార్టీ నేత.. తమ అనుచరుడిని విడిచిపెట్టాలని పోలీసుల మీద ఒత్తిడి చేసినట్లు సమాచారం. కేసు కూడా పెట్టవద్దని సూచించడంతో విషయాన్ని గుట్టుగా ఉంచేశారు. జిల్లా కేంద్రంలో విచ్చలవిడిగా వ్యభిచార గృహాలు నడుస్తున్నాయి. పోలీసులు అడపాదడపా దాడులు చేస్తున్నా.. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు రావడంతో విడిచిపెట్టేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ దందా సాఫీగా సాగిపోతోంది.
అధికారం అండతో వ్యభిచార గృహం నిర్వహణ
పట్టుకుని వదిలేసిన పోలీసులు?


