విజయనగరం టౌన్: విజయనగరం పూల్బాగ్కి చెందిన లిటిల్ బేబీ కృష్ణ అనే ఆరు నెలల బాబుకి వచ్చిన ఎస్ఎంఎస్ టైప్ వన్ వ్యాధికి సంబంధించి డబ్బులు సేకరించడంలో అవకతవకలు జరిగాయని అందుకు ప్రధాన కారకులైన వారిపైన లిటిల్ కృష్ణ తండ్రి ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ ఎఆర్.దామోదర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7వ తేదీన ‘ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమా?’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన ఎస్పీ విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో బాధిత చిన్నారి తండ్రి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. సైబర్ సెల్ సీఐ శోభన్బాబు, ఎస్ఐ పాపారావులను విచారణ నిమిత్తం ప్రత్యేకాధికారులుగా నియమించామన్నారు. డబ్బులు సేకరించడంలో అవకతవకలకు ప్రధాన కారణం నవీన్ రామ్సింగ్ అనే ఎస్.కోటకు చెందిన వ్యక్తి అని, అతనితో పాటూ మరికొంతమంది డబ్బులు సేకరణలో అవకతవకలకు పాల్పడ్డారని, అవకతవకలపై ప్రశ్నిస్తే బెదిరించినట్లు చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్పీ కఠిన చర్యలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిపైన సోషల్ మీడియాను ప్రభావితం చేసే వ్యక్తులు (ఇన్ఫ్లూయెన్సర్స్)ను, డొనేషన్లు ఇచ్చిన దాతలను ఎంక్వయిరీ చేస్తూ దర్యాప్తు ముమ్మరం చేసినట్లు, అదేవిధంగా తప్పు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకునేందుకు పోలీస్ యంత్రాంగం దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు. ఇటువంటి వ్యాధిగ్రస్తులకు చేసే సహాయం రాబోయే రోజుల్లో కూడా కచ్చితంగా పారదర్శకతతో అందాలంటే నేరం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలనే ఆలోచనతో పోలీస్ యంత్రాంగం ముందుకు వెళ్తుందన్నారు.
నవీన్రామ్సింగ్, మరికొందరిపై లిటిల్ కృష్ణ తండ్రి ఫిర్యాదు
విచారణ అధికారులుగా సైబర్ సెల్ సీఐ, ఎస్ఐలు


