విజయనగరం టౌన్: జిల్లా పోలీసు శాఖలో క్రియాశీలకంగా పనిచేస్తున్న హోంగార్డులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ వ్యయంతో కార్పోరేట్ వైద్యమందించేందుకు శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి యాజమాన్యంతో సంప్రదింపులు చేసినట్టు ఎస్పీ ఎఆర్.దామోదర్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ ఆర్ధోపెడిక్ డాక్టర్ శ్రీరామమూర్తి పోలీస్ శాఖపై అభిమానంతో హోంగార్డ్లకు హెల్త్ కార్డ్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడినట్లయితే వారికి కేవలం రూ.100ల రిజిస్ట్రేషన్ రుసుంతో స్పెషలిస్ట్ డాక్టర్స్ కన్సల్టేషన్ ఇవ్వనున్నామన్నారు. అత్యవసర వైద్యసేవలను హోంగార్డ్, వారి కుటుంబ సభ్యులకు అన్నివేళల్లో వైద్యం అందిస్తామన్నారు. ఆస్పత్రిలో ఆర్దో, జనరల్, కార్డియాలజీ, న్యూరో, చెవి, ముక్కు, గొంతు, యురాలజీ, కంటి, డెంటల్, ప్లాస్టిక్ సర్జరీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపిక్, డయాలసిస్, గైనికాలజీ, లేజర్ సర్జరీ నిపుణులు అందుబాటులో ఉండి, వైద్యసేవలదిస్తారన్నారు. హోంగార్డ్లకు ఎస్పీ హెల్త్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీరామూర్తి, లక్ష్మిశ్రీరామూర్తి, డాక్టర్ మాధురి సుధలను ఎస్పీ అభినందించారు. రిజర్వు ఇన్స్పెక్టర్ రమేష్కుమార్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.


