పార్వతీపురం రూరల్: దశాబ్దాలుగా విద్యాబోధన చేస్తున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నుంచి పూర్తి మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు కదం తొక్కారు. యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.మురళీమోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాస్కరరావు మాట్లాడుతూ.. ముప్పై ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో సేవలు అందిస్తున్న వారిని ఇప్పుడు టెట్ పాస్ కాకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం శోచనీయమన్నారు. ఇది 2010 నాటి విద్యాహక్కు చట్టాన్ని ముందస్తు సర్వీసులో ఉన్నవారికీ వర్తింపజేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, విద్యాహక్కు చట్ట సవరణకై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ స్పెషల్ టెట్ నిర్వహిస్తే.. అందరికీ 40 శాతం మార్కులనే ఉత్తీర్ణత ప్రాతిపదికగా తీసుకోవాలని, వారు బోధించే సబ్జెక్టుల్లోనే పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే తీవ్ర పోరాటాల కు సిద్ధపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షుడు పి.మధుసూదనరా వు, కోశాధికారి కె.మురళి, కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, పి.వెంకటనాయుడు, తదితర ఉపాధ్యాయు లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


