దత్తిరాజేరు: మండలంలోని చినరాజేరు గ్రామానికి చెందిన మహదేవ్ తనూజ(25)కొద్ది నెలల క్రితం నిర్వహించిన టెట్లో అర్హత సాధించలేకపోయానని మనస్తాపం చెంది గురువారం ఉదయం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పెదమానాపురం ఎస్సై కళాధర్ తెలిపారు. కొద్ది నెలల క్రితం వివాహమై రెండు రోజుల క్రితం అత్త వారింటికి వచ్చిన తనూజ అందరితో ముభావంగా ఉండేది. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలి స్వగ్రామం మొరక ముడిదాం మండలం గర్భాం. తండ్రి చంద్రశేఖర్ పోలీస్ ఉద్యోగం చేస్తుండడంతో విజయనగరంలో నివాసం ఉంటున్నారు. మృతురాలి భర్త ప్రసన్నకుమార్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మృతురాలి తండ్రి చంద్రశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం నిమిత్తం గజపతినగరం సీహెచ్సీకి మృతదేహాన్ని తరలించినట్లు ఎస్సై చెప్పారు.


