● జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
వి.టి.రామారావు
గజపతినగరం: రైతులకు కల్తీ ఎరువులు, నాసిరకం విత్తనాలు విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వి.టి.రామారావు డీలర్లను హెచ్చరించారు. గజపతినగరం రైతు సేవా కేంద్రంలో పురుగు మందులు, విత్తనాలు విక్రయించే డీలర్స్తో గురువారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విత్తనాలు రాగానే ముందుగా మొలకశాతం నిర్ధారించి రిజిస్ట్రర్లో నమోదుచేయాలని సూచించారు. 80 శాతం కంటే తక్కువ మొలకశాతం ఉన్న విత్తనాలను వెనుకకు పంపించాలన్నారు. యూరియా కార్డ్స్ను అర్హులైన ప్రతీ రైతుకు అందజేస్తామన్నారు. 2026 సీజన్లో ప్రభుత్వం యూరియా కార్డ్స్ ఉన్న వారికి మాత్రమే యూరియా, డీఏపీ అమ్మకాలు చేపట్టాలని ఆదేశించిందన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు గాలి శ్రీనివాస్, గజపతినగరం డివిజన్ నాలుగు మండలాల వ్యవసాయ అధికారులు కిరణ్ కుమార్, గోకుల్ కృష్ణ, గోవిందమ్మ, చంద్రకళ, నాలుగు మండలాల వ్యవసాయ సహాయకులు, ఏఈఓలు పాల్గొన్నారు.


