పెద్దల ఆక్రమణలో ప్రభుత్వ భూమి
సీతానగరం: మండలంలోని బగ్గందొరవలస గ్రామంలోని ప్రభుత్వ భూమిపై పెద్దల కన్ను పడింది. అంతే.. యంత్రాలతో పగలురాత్రీ తేడా లేకుండా చదును చేయించేస్తున్నారు. రూ.కోట్ల విలువైన భూమిని సాగుభూమిగా మార్చేస్తున్నారు. విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే... బగ్గందొరవలస గ్రామంలో 1/1 సర్వే నంబర్లో 15.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దానిని గయ్యాల భూమిగా రెవెన్యూ రికార్డులో నమోదుచేశారు. దానిపై పెద్దల కన్నుపడింది. అధికార బలంతో జేసీబీల సాయంతో చదును చేసేశారు. పనిలోపనిగా పక్కనే ఉన్న మరో 4.84 ఎకరాల భూమిని ఆక్రమణదారుల చేతుల్లోకి తీసుకున్నారు. 1/8లో 1.11 ఎకరాలు, 1/10 లో 1.04 ఎకరాలు, 1/11లో 1.11 ఎకరాలు, 1/14లో 1.14 ఎకరాలు, 2/1లో 0.44 ఎకరాల భూమి బ్యాంకర్ల వేలంలో రాజమండ్రికి చెందిన భద్రగిరి దివాకర్ దక్కించుకున్నారు. దివాకర్ సంబంధిత భూమిని ఎవరికి అప్పగించారా? విక్రయించారా? తెలియదు కానీ లోకాయుక్తలో ఉన్న భూమిపై ఉన్నమట్టిని తీయడం, మడులుగా తయారుచేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఆ భూమి కూడా వదలకుండా చదునుచేస్తున్నా ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆక్రమణల అంశాన్ని తహసీల్దార్ కె.ప్రసన్నకుమార్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా అది ప్రభుత్వ భూమి అని, ఎవరు ఆక్రమించినా శిక్షతప్పదని హెచ్చరించారు. వీఆర్వోను పంపించి ఆక్రమణలను అడ్డుకుంటామన్నారు.


