హెచ్ఓలపై పని భారం
● ఒక హెచ్ఓ ఐదు మండలాల ఇన్చార్జ్
● ఉద్యానవన సాగుపై నీలినీడలు
సీతంపేట: జిల్లాలో హార్టీకల్చర్ ఆఫీసర్ల పోస్టులు, హార్టీకల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్టులు ఎక్కువగా ఖాళీలు ఉండడంతో మిగిలిన వారికి పనిభారం ఎక్కువగా పడుతుంది. జిల్లాలో ఏడు ఉద్యానవనాధికారుల పోస్టులకు ఐదుగురు ఉన్నారు. వీరిలో ఒకరు ప్రసూతి సెలవులో ఉన్నారు. నలుగురు మాత్రమే విధుల్లో ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి నాలుగు నుంచి ఐదు మండలాలు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యానవన సాగుపై నీలినీడలు అలముకుంటున్నాయి. దీనిలో భాగంగా సీతంపేట హెచ్ఓ పి.జయశ్రీ ఏకంగా ఐదు మండలాలు ఇన్చార్జ్ విధులు నిర్వహిస్తున్నారు. ఈమెకు సీతంపేటతో పాటు పాలకొండ, వీరఘట్టం, భామిని, గురుగుబెల్లి మండలాలు పర్యవేక్షిస్తున్నారు. మిగతా మండలాల హెచ్ఓలది కూడా ఇదే పరిస్థితి. క్షేత్ర స్థాయిలో పండ్లతోటల పెంపకం పర్యవేక్షణ, ఎప్పటికప్పుడు వివిధ ఉద్యానవన సాగు పంటలు, కూరగాయాల పంటలపై రైతులకు సలహాలు సూచనలు ఇవ్వచం వంటివి చేయాలి. రైతులకు అవగాహన, శిక్షణ వంటివి ఏర్పాటు చేయాలి. దీంతో తలకు మించిన భారంగా పరిణమిస్తుందని లోలోపల వారు మదనపడుతున్నారు. ఇక ఉద్యానవన విస్తరణాధికారుల పోస్టుల్లో ఒక్కరు కూడా లేకపోవడంతో వీరు పనులు కూడా హెచ్ఓలే నిర్వర్తించడం గమనార్హం.


