చికిత్స పొందుతూ యువతి మృతి
సంతకవిటి: చికిత్స పొందుతూ యువతి మృతి చెందింది. హెడ్ కానిస్టేబుల్ వి.జనార్ధనరావు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మండాకురిటి పంచాయతీ పోతురాజుపేట గ్రామానికి చెందిన యినమల దివ్యకు(22) మార్చి ఏడో తేదీన వివాహం జరగాల్సి ఉంది. అయితే ఈ పెళ్లి దివ్యకు ఇష్టం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై శుక్రవారం పురుగు మందు తాగేసింది. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి రాజాంలోని ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దివ్య తల్లి రమాదేవి ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బొబ్బిలి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త నిత్యం వేధిస్తుండడంతో.. ఆ వేధింపులు తాళలేక భార్య బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. సీఐ కె. నారాయణరావు తెలియజేసిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కుమ్మరివీధికి చెందిన సుంకరి వెంకటరమణమూర్తి, లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు మాధవీదేవి, ప్రసన్నకుమారి ఉన్నారు. బొబ్బిలిలో డ్రైవర్గా పనిచేస్తున్న బాడంగి మండలం చిన భీమవరం గ్రామానికి చెందిన మర్రి నరేష్ను పెద్ద కుమార్తె మాధవీదేవి ప్రేమించి పెళ్లి చేసుకుని బొబ్బిలిలోనే ఉంటున్నారు. కొత్తలో బాగా చూసుకున్న నరేష్ క్రమేపీ వేధింపులు, అనుమానాలతో వేధించేవాడు. ఇదిలా ఉంటే రాజాం పోలిపల్లి అమ్మవారి పండగకు వెళ్దామని మాధవి తల్లిదండ్రుల ఇంటికి శనివారం వచ్చింది. అయితే అదేరోజు రాత్రి 9.30 గంటలకు ఆమె భర్త నరేష్ ఫోన్ చేసి రమ్మనడంతో పిల్లలు నవదీప్ (15), నవ్యదీప్తి (14) పడుకుండిపోవడంతో తనొక్కతే వారింటికి వెళ్లిపోయింది. సరిగ్గా రాత్రి 12.45 గంటలకు మాధవి చిన్నాన్న కుమారుడు కిశోర్కు నరేష్ ఫోన్ చేసి మీ అక్క ఉరి వేసుకుందని చెప్పడంతో వెంటనే కుటుంబ సభ్యులందరూ వెళ్లారు. వెంటనే మాధవిని స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్య సిబ్బంది చెప్పారు. అల్లుడి వేధింపుల వల్లే తన కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని మాధవి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడి
కుమారుడిపై లేని కేసు
బొబ్బిలి: కోమటిపల్లి ఫార్మా కళాశాల విద్యార్థినుల వేధింపుల సంఘటనలో పోలీసులు తమ వంత పాత్ర పోషించారు. ప్రధాన నిందితుడిపై కేసు నమోదు చేయకుండా పక్కన పెట్టేశారు. గురువారం జరిగిన ఈ సంఘటన రాష్ట్ర స్థాయిలో తీవ్ర చర్చనీయాంశం కాగా.. వేధింపులకు గురిచేసిన నలుగురిని ఆలస్యంగా గుర్తించిన పోలీసులు మొదట్లో ఏమీ జరగలేదన్నట్లు వ్యవహరించారు. తీరా పత్రికల్లో పతాక శీర్షికన కథనాలు ప్రచురితమయ్యే సరికి నిందితులను గుర్తించారు. బాధిత విద్యార్థినులు తెలియజేసిన వివరాల మేరకు నలుగురు ఆకతాయిలను గుర్తించిన పోలీసులు అందులో ఇద్దరిపైనే కేసు నమోదు చేశారు. అసలైన ప్రధాన నిందితుడు, గ్రామ టీడీపీ కమిటీ అధ్యక్షుడు ఆవాల పాపారావు కుమారుడు ఆవాల మణికంఠను మాత్రం కేసులో చేర్చకుండా అధికార పార్టీ వారి పట్ల స్వామిభక్తిని చాటుకున్నారు. దీనిపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రధాన నిందితుడ్ని కాపాడుతున్న పోలీసులు ఎవరి ప్రాపకం కోసం పాకులాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ఎమ్మెల్యే బేబినాయన ఆదేశాలతో పాపారావు కుమారుడు మణికంఠకు మినహాయింపు ఇచ్చి మరో ఇద్దరిని కేసులో నిందితులుగా చేర్చి కేసు పెట్టడం హాస్యాస్పదంగా ఉందని పలువురు మండిపడుతున్నారు. వేధింపులకు కారకులైన ఆవాల మణికంఠ, కర్రి గణేష్లను కాపాడుతూ ఆవాల మోహనరావు, పెంట వినయ్లపై కేసు పెట్టి పోలీసులు తమై పక్షపాత వైఖరి కనబరుచుకున్నారు.
చికిత్స పొందుతూ యువతి మృతి
చికిత్స పొందుతూ యువతి మృతి


