
తోటపల్లి కాలువగట్లపై కంకర తవ్వకాలు
బొబ్బిలి రూరల్: అక్రమ సంపాదనకు అలవాటు పడిన కంకర దొంగలు తోటపల్లి కాలువ గట్లపై ఉండే కంకరకుప్పలపై కన్నేశారు. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో ఇష్టానుసారం గట్లను తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. మరో వైపు గట్లను చదును చేస్తూ ఆక్రమణలకు పూనుకుంటున్నారు. మండలంలోని పిరిడి గ్రామం వద్ద నున్న తోటపల్లి కాలువకు ఇరువైపులా కంకర గట్లను తవ్వి కంకరను తరలించుకు పోతున్నారు. కాలువ నిర్మా ణానికి రైతుల నుంచి భూసమీకరణ చేయగా ప్రభుత్వం వారందరికీ నష్టపరిహారం చెల్లించింది. కానీ కొంతమంది కంకరను తవ్వి ఆ భూములను ఆక్రమించే పనిలోపడ్డారు. గ్రామానికి కూతవేటు దూరంలో తోటపల్లి కుడి ప్రధాన కాలువ వెళ్తుంది. గతంలో కాలువ నిర్మాణానికి అక్కడ కాలువ పొడవునా తవ్విన కంకర, మట్టిని అక్కడే పోగు చేసి కుప్పలుగా వేశారు. దీనిపై కన్నేసిన కంకర దొంగలు రాత్రిళ్లు పెద్ద ఎత్తున కంకరను తవ్వి తరలించుకుపోతున్నారు.దీనిపై అటు నీటిపారుదలశాఖ, ఇటు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలువ వెంబడి ఉన్న అనేక చోట్ల కంకరను తవ్వి తోలుకుపోగా ఉన్నదాన్నైనా కాపాడేందుకు, ఆక్రమణకు గురికాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

తోటపల్లి కాలువగట్లపై కంకర తవ్వకాలు