
కన్నవారిని కడతేర్చిన కసాయి అరెస్ట్
విజయనగరం క్రైమ్: ఆస్తి కోసం జన్మనిచ్చిన తల్లిదండ్రులనే కాటికి పంపించాడో కసాయి కొడుకు. తోడబుట్టిన చెల్లికి ఆస్తిలో వాటా ఇచ్చారన్న అక్కసుతో కన్నవారిని ట్రాక్టర్తో తొక్కి చంపాడు. ఈ సంఘటన ఈ నెల 26న పూసపాటిరేగ మండలం రెల్లివలసలో చోటుచేసుకోగా.. నిందితుడ్ని సోమవారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్సీ శ్రీనివాసరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెల్లివలసకు చెందిన పాండ్రంకి అప్పలనాయడు, జయమ్మ దంపతులకు రాజశేఖర్, రాధాకుమారి సంతానం. కూతురు రాధను ఆనందపురం మండలం నెలతేరు గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి చేసి 30 సెంట్ల భూమిని పసుపు,కుంకుమ కింద ఇచ్చారు. కుమారుడు రాజశేఖర్ భార్యాబిడ్డలతో రెల్లివలసలోనే వేరేగా ఉంటున్నాడు. అతనికి రూ. 12 లక్షలు అప్పు ఉండడంతో 70 సెంట్ల భూమిని తనకు ఇవ్వాలని తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు గొడవ పడేవాడు. ఇటీవల రైతుభరోసా కోసం రాజశేఖర్ దరఖాస్తు చేయగా.. తండ్రి పేరుమీద 40 సెంట్ల భూమి.. సోదరి రాధ పేరుమీద 30 సెంట్ల భూమి ఉన్నట్లు తెలుసుకున్నాడు. వెంటనే గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించినా తేలకపోవడంతో.. ఈ నెల 26న సోదరి పేరుమీదున్న భూమిని చదును చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ సమయంలో అడ్డుకోవడానికి వచ్చిన తల్లిదండ్రులను ట్రాక్టర్తో తొక్కి చంపాడు. సోదరి రాధ ఫిర్యాదు మేరకు ఎస్సై దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి... సోమవారం నిందితుడ్ని అరెస్ట్ చేశారు.