ఈనెల 7 నుంచి 20వ తేదీ వరకు ప్రతిరోజూ యోగా సాధన 21న ఐదువేల మందితో మెగా యోగా యోగాంధ్ర నిర్వహణపై ఇన్చార్జి కలెక్టర్ సమీక్ష
నరసరావుపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణను జిల్లాలో విజయవంతంగా చేపట్టేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంజన సింహ అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు. ప్రతిరోజూ యోగా సాధనలో భాగంగా ఈనెల ఏడు నుంచి 20 వరకు ప్రతి రోజు ఉదయం 6.45 గంటల నుంచి 7.30 గంటల వరకు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలో యోగా సాధన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యోగాను ప్రజల దైనందిన జీవితంలో భాగం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ప్రత్యేక యోగా కార్యక్రమాలు..
జూన్ 12న ఆశ, ఏఎన్ఎంల తో ‘థిమేటిక్ యోగా’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పర్యాటక ప్రదేశాల యోగాలో భాగంగా 17న కోటప్పకొండ, 19న అమరావతిలో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 21న భారీ స్థాయిలో ఐదు వేలమందితో మెగా యోగా కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
యోగా పోటీల నిర్వహణ..
యోగాపై ఆసక్తి పెంపొందించేందుకు పోటీలను నాలుగు స్థాయిల్లో నిర్వహించనున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ తెలిపారు. ఈనెల 7–9న గ్రామ స్థాయి పోటీలు, 10 –12న మండల స్థాయి పోటీలు, 14 –16న జిల్లా స్థాయి పోటీలు నిర్వహించాలని, జిల్లా స్థాయిలో గెలుపొందిన వారు 18న రాష్ట్ర స్థాయి పోటీలులో పాల్గొంటారని తెలిపారు.
యోగా గురువులు, ట్రైనర్లు, ట్రైనీల మ్యాపింగ్
ప్రతి సచివాలయానికి 10 మంది ట్రైనీలను మ్యాపింగ్ చేసి యోగా శిక్షణ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. యోగ గురువులు, మాస్టర్ ట్రైనర్లు, ట్రైనర్లు సమన్వయంతో కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
యాప్లో నమోదు ..
యోగాకు సంబందించిన అన్ని వివరాలు ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేయాలని, ఫ్రీ ఈవెంట్ కార్యక్రమాల నమోదు, పాల్గొనే వారి వివరాల అప్లోడ్, పోస్ట్ ఈవెంట్ ఫోటోలు, సమాచారం సకాలంలో అప్లోడ్ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడేలా పర్యవేక్షణ ఉండాలని తెలిపారు.
ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ
పూర్తి చేయండి..
నరసరావుపేట: జిల్లాలో ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని బూత్ స్థాయి అధికారులను (బీఎల్ఓ) ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఇంటింటి ఓటర్ల సర్వే ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ లోగానే మ్యాపింగ్ పనులన్నింటినీ చక్కబెట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా 2002 నాటి ఓటర్ల జాబితాతో ప్రస్తుతం ఉన్న 2025 ఓటర్ల జాబితాను ఖచ్చితంగా మ్యాపింగ్ చేయాల్సి ఉందని, క్షేత్రస్థాయిలో ఎలాంటి తప్పులకు తావులేకుండా ఈ ప్రక్రియ జరగాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


