ముప్పాళ్ల: ఎదురుగా వస్తున్న మరో ట్రాక్టర్ను తప్పించే క్రమంలో అదుపు తప్పి మరో ట్రాక్టర్ కాల్వలో బోల్తా పడి నడుపుతున్న విద్యార్ధి మృతి చెందిన సంఘటన మండలంలోని మాదల–రామకృష్ణాపురం రోడ్డు లో శుక్రవారం జరిగింది. సంఘటన కు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఇరుకుపాలెం గ్రామ శివారు రామకృష్ణాపురం గ్రామానికి చెందిన గోగడ శ్రీనివాసరావుకు ఇద్దరు సంతానం.
వీరిలో వంశీ(19) ఇంటర్ పూర్తి చేసి ఎంసెట్ పరీక్షలు రాసి ఇంటివద్ద ఉంటున్నాడు. ఖాళీ సమయంలో తండ్రి శ్రీనివాసరావుకు వ్యవసాయ పనుల్లో తోడుగా ఉండేవాడు. ఈ క్రమంలో శ్రీనివాసరావు వ్యవసాయ పనులు పూర్తి కావడంతో తన ట్రాక్టర్తో పొలంలో తొండపి చెరువు నుంచి మట్టి తోలకం పనులు చేస్తున్నాడు. శుక్రవారం సైతం అదే పనిలో ఉండగా భోజనం చేసేందుకు ట్రాక్టర్ నిలిపివేస్తుండగా అక్కడే ఉన్న వంశీ నేను వెళ్ళి వస్తాను అని చెప్పి ఖాళీ ట్రాక్టర్ తీసుకొని తొండపి బయలుదేరాడు. మాదల సమీపంలో మరో ట్రాక్టర్ ఎదురుగా రావటంతో తప్పించే క్రమంలో అదుపు తప్పి ట్రాక్టర్, ట్రక్కు కాల్వలో బోల్తా పడ్డాయి. గమనించిన స్థానికులు ట్రాక్టర్ కిందపడి తీవ్ర రక్త గాయాలతో ఉన్న వంశీని పైకి లేపి 108 కి సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన వంశీ కి వాహన సిబ్బంది ప్రాథమిక చికిత్స అందిస్తూ 108 వాహనంలో చికిత్స కోసం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వంశీ మృతి చెందాడు.


