ఢిల్లీని ఫిదా చేసిన గుంటూరు ఆతిథ్యం
● ‘వేదిక’అంకితభావానికి దక్కిన అభినందన
●నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రశంసలు
యడ్లపాడు: తెలుగు నాటక రంగానికి.. గుంటూరు ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో యడ్లపాడుకు చెందిన ‘వేదిక’ (తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన సంఘం) అసాధారణ విజయాన్ని సాధించింది. గుంటూరులో 25వ భారత్రంగ్ మహోత్సవ్–2026 అంతర్జాతీయ నాటకోత్సవం దిగ్విజయ నిర్వహణకు దేశ రాజధాని ఢిల్లీ ఫిదా అయింది. ఈ వేడుకల విజయవంతంపై న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వేదిక అధ్యక్షుడు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబుపై ప్రశంసలు కురిపిస్తూ ఎన్ఎస్డీ డైరెక్టర్ చిత్తరంజన్ త్రిపాఠి ప్రత్యేక అభినందన పత్రాన్ని పంపించారు. ఆ విషయాలను ఆదివారం ముత్తవరపు మీడియాతో పంచుకున్నారు.
కళాకారుల గుండెల్లో చెరగని ముద్ర...
గత ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీవరకు గుంటూరు శ్రీవెంకటేశ్వర విజ్ఞానమందిరంలో జరిగిన ఈ అంతర్జాతీయ నాటకోత్సవాలు కేవలం ప్రదర్శనలకే పరిమితం కాకుండా, ఒక గొప్ప సాంస్కృతిక పండుగలా సాగాయని ఎన్.ఎస్.డి కొనియాడిందని సురేష్బాబు తెలిపారు. ముఖ్యంగా దేశ, విదేశీ కళాకారులకు కల్పించిన వసతులు, సాంకేతిక తోడ్పాటు ఉత్సవం నిర్వహణలో ప్రదర్శించిన క్రమశిక్షణ అద్భుతమని ప్రశంసించిందన్నారు. ఈ గౌరవం ‘వేదిక’ బృందం అంకితభావానికి, రెండు తెలుగు రాష్ట్రాల నాటక రంగ పెద్దలకు, గుంటూరు నగరవాసుల సహకారానికి దక్కిన ప్రతిఫలమన్నారు. దేశ, విదేశీ నాటక బృందాల మధ్య వేదిక ఒక వారధిగా నిలిచిందన్నారు. ఐదు రోజుల పాటు ఎక్కడా ఆటంకాలు లేకుండా పండుగ వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించడం గొప్ప అనుభూతినిచ్చిందని తెలిపారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సహకారంతో వేదిక కలిసి వేసిన ఈ తొలి అడుగును సుదీర్ఘ ప్రయాణంగా కొనసాగిస్తామని సురేష్ బాబు ధీమా వ్యక్తం చేశారు.


