అన్ని రంగాలపై ఏఐ ప్రభావం
జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్ లక్ష్మణరావు
గుంటూరు రూరల్: ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలపై ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రభావం ఉందని, దానిని మానవ జాతి సంక్షేమానికి ఉపయోగించే విధంగా చర్యలు ఉండాలని ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నిపుణుడు, వాల్మార్ట్ ఇండియా సైబర్ సెక్యూరిటీ లీడ్ ఎస్ దిలీప్కుమార్ తెలిపారు. ఆదివారం జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నగర శివారు లాంలోని చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నో వర్క్షాప్లో ఆయన పాల్గొన్నారు. ఆయన వివిధ రంగాలలో ఏఐ పాత్రను వివరించారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రపంచంలో మూడు శతాబ్దాలుగా పారిశ్రామిక విప్లవం, సాంకేతిక విప్లవం జరిగాయన్నారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ విప్లవం జరగబోతున్నదని, విద్యార్థులు దానికి అనుగుణంగా నైపూణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. టెక్నాలజీకి సంబంధించిన ఏ మార్పులు అయినా మానవజాతి పురోగతికి, ఉపాదికల్పనకు దోహదపడాలని, కానీ కార్పొరేట్ కంపెనీల దృక్పథం ఆలోచనలకు, ప్రజా సంక్షేమానికి అనుగుణంగా ఉండవని చెప్పారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక పాఠశాల స్థాయిలో చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు కృషిచేస్తుందన్నారు. భవిష్యత్తులో ఇంజినీరింగ్, మెడిసిన్, మెడికల్, న్యాయ విద్యా వ్యవస్థ కోసం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు లైఫ్ స్కిల్స్ సామాజిక స్కిల్స్ నేర్చుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు కె యశ్వంత్, ప్రొఫెసర్ ప్రితిదాయ్, నిహారిక, జన విజ్ఞాన వేదిక నాయకుడు కె శ్రీనివాస్, మురళిధర్, చాందిని, రమేష్, బాలాజి తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు వెస్ట్(క్రీడలు): ఆర్మా డ్రాగన్స్ షోటోకాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ లెవెల్ ఓపెన్ కారటే, కుంగ్ఫూ తైక్వాండో చాంపియన్షిప్–2026 పోటీలు ముగిశాయి. ఆదివారం స్థానిక గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించిన పోటీలకు ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసరావు, ఉగ్గిరాల సీతారామయ్య పాల్గొన్నారు. పోటీల నిర్వహకుడు పి.రాంబాబు మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 620 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. క్రీడాకారులు చక్కని క్రీడా స్ఫూర్తి చాటి పోటీల్లో తలపడ్డారన్నారు. అనంతరం విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు ప్రధానం చేశారని చెప్పారు. కార్యక్రమంలో పి.సరస్వతి, ఆలపాటి రవికుమార్, అంబటి నవ కుమార్, ఏ.సాయిరామ్, తదితరులు పాల్గొన్నారు.
నెహ్రూనగర్: నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ క్రీడా ప్రాంగణం, స్విమ్మింగ్ పూల్ సొసైటీ పాలకవర్గ సెక్రెటరీగా వజ్జా రామకృష్ణ ఎన్నికై నట్లు డిప్యూటీ కమిషనర్, ఎన్టీఆర్ స్టేడియం ఎక్స్ అఫిషియో జాయింట్ సెక్రటరీ, ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికల అధికారి సీహెచ్.శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం జరిగిన ఎన్టీఆర్ స్టేడియం పాలకవర్గ ఎన్నికలు నిర్వహించి, గెలిచిన అభ్యర్థులకు డిక్లరేషన్ పత్రాలను అందజేశామని తెలిపారు. స్టేడియంలో మొత్తం 2,160 మంది ఓటు హక్కు కలిగి ఉండగా, వారిలో 1267 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. 20 ఓట్లు చెల్లలేదన్నారు. సెక్రటరీ పోస్టుకు పోటీ పడిన అభ్యర్థుల్లో వజ్జా రామకృష్ణకు 851 ఓట్లు పోల్ కాగా, దొడ్డపనేని రాజేంద్రకుమార్కు 396 ఓట్లు పోలయ్యాయన్నారు. వజ్జా రామకృష్ణకు 455 ఓట్లు మెజారిటీ రావడంతో ఆయన్ను సెక్రటరీగా గెలుపొందినట్లు డిక్లేర్ చేశామన్నారు. వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కు దామా మహేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ పోస్టుకు పాకనాటి ఉమామహేశ్వరరావు, ట్రెజరర్ పోస్టుకు కండె కాంతారావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి పురుషులలో ఇంకొల్లు వెంకటరత్తయ్య, జి.హనుమంతరావు, మహిళల్లో గుంటుపల్లి యామిని శివ జ్యోతి, లగడపాటి అంజలిలు గెలుపొందగా వారికి డిక్లరేషన్ పత్రాలను అందజేశామన్నారు.
అన్ని రంగాలపై ఏఐ ప్రభావం
అన్ని రంగాలపై ఏఐ ప్రభావం


