పచ్చమూకల పైశాచికం
పిడుగురాళ్ల రూరల్/పిడుగురాళ్ల: అధికారం అండతో పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేసి.. విచ్చలవిడిగా హత్యాయత్నాలు, హత్యలకు పాల్పడుతూ రక్త దాహం తీర్చుకుంటున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా జూలకల్లులో ఓ వైఎస్సార్సీపీ నాయకుడిపై టీడీపీ గూండాలు హత్యాయత్నం చేశారు. ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో.. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాలు.. జూలకల్లు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బీరవల్లి రామిరెడ్డి వర్షం పడేలా ఉండటంతో సోమవారం అర్ధరాత్రి పొలానికి వెళ్లాడు. మొక్కజొన్న కండెలపై పట్టాలు కప్పి ఇంటికి బయల్దేరాడు. అప్పటికే ఆయనపై నిఘా పెట్టిన టీడీపీ గూండాలు ఇనుముక్కల సామేలు, షేక్ దాదాసాహెబ్, చల్లా మోజెస్, సింహాద్రి మరికొందరు ఒక్కసారిగా రామిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ఇనుప రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. రామిరెడ్డి స్పృహ కోల్పోవడంతో.. వారంతా వెళ్లిపోయారు. అనంతరం కొద్దిసేపటికి అటుగా వెళ్లిన కొందరు.. రామిరెడ్డిని చూసి కుటుంబసభ్యులకు, బంధువులకు సమాచారమిచ్చారు. కుటుంబసభ్యులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని రామిరెడ్డిని పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. రామిరెడ్డి కాళ్లు, ఎడం చేయి విరిగినట్లు తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా, బీరవల్లి రామిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్రెడ్డి పరామర్శించారు. గురజాల నియోజకవర్గంలో గూండా రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. జూలకల్లులో ఇప్పటికే ఆరుగురిపై టీడీపీ గూండాలు దాడి చేశారని చెప్పారు. ఇంకా మూడేళ్లు మాత్రమే ఉందని.. దాడులు చేసే వారు, చేయించే వాళ్లు ఇంతకింతా అనుభవించే రోజులు వస్తాయన్నారు. చట్టపరంగా శిక్షలు పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
గురజాలలో రౌడీ రాజ్యం
పచ్చమూకల పైశాచికం
పచ్చమూకల పైశాచికం


