
అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు
నరసరావుపేట రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ, మోసం తదితర సమస్యలకు చెందిన 120 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జేవీ సంతోష్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణ పాల్గొన్నారు.
పది నెలలుగా నా సోదరి గిరిజ కనిపించడం లేదు. నరనసరావుపేట రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా స్పందించలేదు. గిరిజను గ్రామంలోని రాఘవకు ఇచ్చి వివాహం చేయగా ముగ్గురు సంతానం ఉన్నట్టు తెలిపింది. గిరిజకు అనారోగ్యంగా ఉండటంతో పూజలు జరిపించామని, ఆ తరువాత నుంచి కనిపించడం లేదు.
–యాతగిరి ఉమామహేశ్వరి, ఇస్సప్పాలెం
నా తమ్ముడు రవీంద్రబాబుకు ఉద్యోగం ఇప్పిస్తానని ఫిరంగిపురానికి చెందిన పొలంకి బాజిబాబు, కింగ్బాబు చెప్పడంతో రూ.6 లక్షలు చెల్లించాం. అయితే ఇప్పటి వరకు ఉద్యోగం ఇప్పించకపోవడంతో నగదును తిరిగి ఇవ్వమని అడిగితే వారి నుంచి ఎటువంటి సమాధానం రావడం లేదు. నగదు ఇప్పించి న్యాయం చేయండి.
–ధర్నాసీ దాసు,
కొండవీడు, యడ్లపాడు మండలం
గ్రామానికి చెందిన మణికంఠతో పదేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరు సంతానం. పని నిమిత్తం ప్రత్తిపాడు మండలం నిమ్మగడ్డవారిపాలెం వెళ్లాం. ఇంటి ఎదురు ఉండే యువతితో నా భర్త వెళ్లిపోయి ఇప్పుడు వచ్చాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు. నా అత్తామామకు చెందిన ఎకరం భూమి కూడా యువతి పేరిట రిజిస్ట్రేషన్ చేశాడని తెలిిసింది. నాకు, నా పిల్లలకు న్యాయం చేయాలి.
–కుమరగిరి గోవిందమ్మ,
నరమాలపాడు, కారంపూడి మండలం
1985లో చీతిరాల సుబ్రహ్మణ్యం పేరుతో జీపీ చేసినట్టుగా నకిలీ పత్రాలు సృష్టించి నాకు చెందిన 1.50 ఎకరాల భూమిని గతేడాది గ్రామానికి చెందిన అమ్మిరెడ్డి నాగార్జునరెడ్డికి విక్రయించాడు. నకిలీ పత్రాలు సృష్టించి భూమిని విక్రయించిన చీతిరాల సుబ్రహ్మణ్యంపై చర్యలు తీసుకోవాలి.
–గోగిరెడ్డి హనుమంతరెడ్డి,
చాట్రగడ్డపాడు, వినుకొండ మండలం

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి