
యోగాతో మెరుగైన ఆరోగ్యం
జయపురం: యోగాతో మెరుగైన ఆరోగ్యం సాధ్యమని వక్తలు అన్నారు. ఈ నెల 21వ తేదీన అంతర్ జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జయపురం అరవిందనగర్ విద్యామందిర ప్రాంగణంలో జిల్లాస్థాయి యోగా మహోత్సవ కమిటీ, జిల్లా స్థాయి యోగా నిర్వాహకుల ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. శిబిరంలో యోగా శిక్షకులు జయసేన్ మహంతి, సురేష్ నందోలు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. ఈ నెల 21వ తేదీన జరగనున్న యోగా డేలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో యోగా మహోత్సవ కమిటీ సభ్యులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యనిర్వాహకులు డాక్టర్ మనోరంజన్ ప్రధాన్ పాల్గొన్నారు. శిక్షణ పొందిన వారందరికీ ధ్రువ పత్రాలు అందజేశారు.