
రైతు సాధికారతే లక్ష్యం: సీఎం
భువనేశ్వర్: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పాలన ఏడాది పూర్తి సందర్భంగా పలు ప్రాంతల్లో విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పశ్చిమ ఒడిశా బొలంగీరు జిల్లాలో మంగళవారం నిర్వహించిన కృషక్ శక్తి సమావేశంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సుదీర్ఘంగా ప్రసంగించారు. అధునాతన సాంకేతిక, ఆర్థిక, మౌలిక సదుపాయాల మద్దతు ద్వారా రైతులను శక్తివంతం చేయడానికి ప్రభుత్వం నిబద్ధతను ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. రాష్ట్ర రైతాంగం సంక్షేమానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని క్రమం తప్పకుండా వాస్తవ కార్యాచరణలో అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీ అన్నం అభియాన్ కింద ప్రభుత్వం సంప్రదాయ ఽవంగడాలను పునరుజ్జీవింపజేసి పౌష్టికాహార సాగుని ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ చొరవలో భాగంగా, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు తృణ ధాన్యాల లడ్డూలను పంపిణీ చేస్తామన్నారు. పశ్చిమ ఒడిశాలో వ్యవసాయ విద్య, శిక్షణను ప్రోత్సహించడానికి బలంగీర్లో వ్యవసాయ కళాశాల, సోన్పూర్లో మత్స్య కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
2047 నాటికి వికసిత భారత్ జాతీయ లక్ష్యం బాటలో రాష్ట్రావతరణ శత జయంతి 2036 నాటికి సుసంపన్న ఒడిశా ఆవిష్కరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యాచరణలో వ్యవసాయం, రైతు అభివృద్ధి సాధించడం కీలకమైన అంశాలుగా పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ వ్యవసాయం ప్రాధాన్యతతో రైతు సోదరసోదరీమణుల ఆర్థిక సాధికారత బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. రైతులకు అన్ని రకాల సాంకేతిక సహాయాన్ని అందుబాటులోకి తెచ్చి ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ రైతు సంక్షేమ చర్యలు రైతుల ఆదాయాన్ని పెంపొందించడంతో రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించనున్నట్లు తెలిపారు.
ఈ సభలో ముఖ్యమంత్రి వ్యవసాయ రంగంలో సాఫల్యత సాధించిన రైతులను సత్కరించి అభినందించారు. వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడానికి రైతాంగం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలని ప్రోత్సహించారు.
వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయింపులను పెంచడం రైతు సాధికారితపై ప్రభుత్వం నిబద్ధత స్పష్టం అవుతుందని ఈ సభలో ప్రసంగించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కనక్ వర్ధన్ సింగ్ దేవ్ తెలిపారు. ఒడిశా ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లకు పండ్లను ఎగుమతి చేస్తోంది. రైతు సాధికారత కోసం ప్రభుత్వం సంకల్పించిన పథకాలు, కార్యక్రమాల సాఫల్యతకు ఇది నిదర్శనంగా ఆయన కొనియాడారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ముఖేష్ మహాలింగ్ ప్రజారోగ్యం కోసం స్థానిక ఉత్పత్తుల ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తిస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయ రంగం బలోపేతం తొలి మెట్టుగా రాష్ట్ర పంచాయతీ రాజ్, తాగు నీరు విభాగం మంత్రి రబీ నారాయణ్ నాయక్ ప్రసంగించారు. కార్యక్రమానికి బొలంగీర్ లోక్ సభ సభ్యురాలు సంగీత కుమారి సింగ్ దేవ్, కలెక్టర్ గౌరవ్ శివాజీ ఇసల్వార్, బర్గఢ్ లోక్ సభ సభ్యుడు ప్రదీప్ పురోహిత్, టిట్లాగడ్ నియోజక వర్గం ఎమ్మెల్యే నబీన్ కుమార్ జైన్, కంటాబంజి నియోజక వర్గం ఎమ్మెల్యే లక్ష్మణ్ బాగ్, ఉత్తర ప్రాంత రెవెన్యూ కమిషనర్ సచిన్ రామచంద్ర యాదవ్ తదితరులు హాజరయ్యారు.

రైతు సాధికారతే లక్ష్యం: సీఎం

రైతు సాధికారతే లక్ష్యం: సీఎం