30 జిల్లాలకు అతిసారం | - | Sakshi
Sakshi News home page

30 జిల్లాలకు అతిసారం

Jun 18 2025 7:26 AM | Updated on Jun 18 2025 7:26 AM

30 జి

30 జిల్లాలకు అతిసారం

భువనేశ్వర్‌: రాష్ట్రంలో అతిసారం, కలరా వ్యాప్తి అధికార యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 30 జిల్లాలను హై అలర్ట్‌ ప్రాంతాలుగా ప్రకటించింది. ముప్పును నియంత్రించడానికి నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. జాజ్‌పూర్‌ జిల్లా మాత్రమే కాకుండా రాష్ట్రంలోని 30 జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని, వ్యాప్తిని అరికట్టడానికి నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్‌, కార్యదర్శి ఎస్‌.అశ్వత్థి తెలిపారు. అతిసార, కలరా తాజా స్థితిగతుల్ని సమీక్షించేందుకు ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు పెరుగుతున్నాయి. వీటి కట్టడికి అత్యవసర చర్య తీసుకోవడం అనివార్యంగా పేర్కొన్నారు. 5 జిల్లాల్లో గత పది రోజుల్లో 300 కి పైగా కొత్త అతిసార రోగులు నమోదయ్యారు. ఆస్పత్రిలో చేరిన రోగులను 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచాలని జిల్లా ఆరోగ్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కొత్త కేసుల్లో ఎక్కువ భాగం తేలికపాటివేనని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తల ఇంటింటికీ వెళ్లి అవగాహన ప్రచారం చేస్తున్నారు. మరో 7 రోజుల పాటు ఈ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతుందన్నారు. పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షించేందుకు రాష్ట్ర స్థాయిలో రోజువారీ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 14 మంది సభ్యుల కేంద్ర బృందం ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వ్యాధిని అరికట్టడానికి చర్యలను సూచిస్తోంది.

రాష్ట్ర ఆరోగ్య అధికారులు కేంద్ర బృందంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ వ్యాప్తి ఇంకా అంటువ్యాధిగా విజృంభించలేదని పరిశీలన వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. పరిస్థితి విషమించకుంగా ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాలతో సహా మిగిలిన 25 జిల్లాల్లో కూడ తాగు నీటి వనరులను క్రిమిరహితం చేస్తోందని ప్రకటించారు. కలరా కేసులను గుర్తించేందుకు పరీక్షించిన నమూనాల్లో కేవలం 10 శాతం మాత్రమే కలరా సంక్రమణను నిర్ధారించాయని ఆరోగ్య శాఖ కమిషనరు, కార్యదర్శి ధ్రువీకరించారు.

ఆరోగ్య కార్యదర్శి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో కార్యకలాపాల పరిశీలన కోసం 4 రాష్ట్ర స్థాయి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ బృందాలలో సీనియర్‌ అధికారులు, నిపుణులు, వైద్య సిబ్బంది ఉన్నారు. తక్షణ చికిత్స, ప్రజలలో అవగాహన, సమర్థవంతమైన వ్యాధి నిర్వహణ వ్యవహారాల్లో స్థానిక ఆరోగ్య సంరక్షణ విభాగాలతో సమన్వయం పరిరక్షణ ఈ బృందాల ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ బృందాలు బొడొచొణ, భువన్‌, బంకి, ధర్మశాల , భండారి పొఖొరి సహా వివిధ ప్రాంతాలను సందర్శిస్తాయి.

బీఎంసీ అప్రమత్తం

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కలరా కేసులు ఖరారు కావడంతో స్థానిక నగర పాలక సంస్థ బీఎంసీ అప్రమత్తమైంది. స్వయంప్రతిపత్తి సంస్థల ఆధ్వర్యంలో వివిధ నివారణ చర్యలు చేపడుతున్నారు. తాగునీటి వనరులను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నారు, అవసరమైతే శుద్ధి చేస్తున్నారు. గొట్టపు బావులు, ఇతరేతర తాగు నీటి మాధ్యమాలు మరమ్మతులు చేస్తున్నారు. ఆహార భద్రతా అధికారులు నాణ్యతను తనిఖీ చేయడానికి వివిధ ఆహార, పానీయాల దుకాణాలను సందర్శిస్తున్నారు. దీనితో పాటు, కలరా గురించి ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తున్నారు.

30 జిల్లాలకు అతిసారం 1
1/3

30 జిల్లాలకు అతిసారం

30 జిల్లాలకు అతిసారం 2
2/3

30 జిల్లాలకు అతిసారం

30 జిల్లాలకు అతిసారం 3
3/3

30 జిల్లాలకు అతిసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement