
కొలాబ్ నదిలో మునిగిన నాటు పడవ
జయపురం: జయపురం సబ్డివిజన్ కుంద్ర సమితి కెరామటి గ్రామ సమీపం కొలాబ్ నదిలో ఒక నాటు పడవ శనివారం ఉదయం మునిగి పోయింది. అదృష్టవశాత్తు పడవలో పయనిస్తున్న వారందరూ ప్రాణాలతో బయట పడ్డారు. పడవ నదిలో మునిగిన సమయంలో నది ఒడ్డున ప్రజలు ఉండటంతో వారు వెంటనే స్పందించి అందరినీ రక్షించారు. ఆ పడవలో 20 మందికి పైగా ప్రజలు పయనిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. కొంతమంది వ్యక్తులు ఒక సామాజిక పనిపై కొలాబ్ నది కొసరజొడ ఘాట్ వద్దకు వెళ్లారు. ఒక పడవలో 20 మంది ఎక్కారు. పడవ నది మధ్యకు వెళ్లగా అకస్మాత్తుగా మునిగిపోయింది. నది ఒడ్డునున్న కొంతమంది యువకులు ప్రమాదాన్ని చూచి వెంటనే నదిలో దూకి నదిలో మునిగి పోతున్న వారిని ఒడ్డుకు తీసుకు రాగా ఈత వచ్చిన కొందరు ఒడ్డుకు చేరారు. వారిని రక్షించిన వారికి భజమన సాంత, ఉపేంధ్ర భొత్ర, సంజయ, సంజిత, అమర భొత్ర, కై ళాస హరిజన్, గుప్త హరిజన్ తదితరులు సహకరించారు. ఈ పడవను గత నవంబర్ 14న కొట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్స ప్రారంభించారని, కానీ అప్పుడే పాడైపోయిందని తెలిపారు. ఈ నదిపై వంతెన నిర్మించేందుకు 16 కోట్లు మంజూరు చేసినా వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టలేదని ఆరోపిస్తున్నారు. నదిలో పడవ ప్రయాణం ప్రాణాంతకంగా ఉందని అంటున్నారు.
ప్రయాణికులు క్షేమం