గన్నవరం: మండలంలోని అల్లాపురం గ్రామానికి చెందిన బాలిక జ్వరం, మెదడువాపు వ్యాధి లక్షణాలతో మృతి చెందడం కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ కాటూరి రామారావు కుమారై సుస్మిత (14) దావాజిగూడెం జెడ్పీ హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. వారం రోజులుగా జ్వరంతో తీవ్ర అస్వస్తతకు గురైన సుస్మితను మూడు రోజుల క్రితం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరి స్థితి విషమించి బాలిక మంగళవారం రాత్రి మృతి చెందింది. సుస్మిత తీవ్ర జ్వరంతో పాటు మెదడు వాపు లక్షణాలతో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. బాలిక భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు బుధవారం గ్రామానికి తీసుకొచ్చిన అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద కుమార్తె సుస్మిత అకాల మృతితో తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు భోరున విలపించారు.


